Malla Reddy Modi Meeting: తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ రేవంత్రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా చేరిక జరగలేదు. ఇప్పటికే ఆయన ఎవరో అర్థమై ఉంటుంది కదూ.. హా ఆయనే.. పూలమ్మిన.. పాలమ్మిన.. స్కూల్ పెట్టిన.. కాలేజీలు పెట్టిన.. ఎంపీగ గెలిచిన.. ఎమ్మెల్యేగ గెలిచిన.. మంత్రి అయినా అంటూ తన వాక్చాతుర్యం, బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకునే మల్లారెడ్డి. ప్రస్తుతం అధికారంలో లేరు. దీంతో సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన కోడలు, మల్లారెడ్డి విద్యాసంస్థల కో చైర్పర్సన్ ప్రీతిరెడ్డి యాక్టివ్గా ఉంటున్నారు. ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయాల్లో ఆమె ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి ప్రధాని మోదీతో భేటీకావడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది.
రాజకీయాలపై ప్రీతి ఆసక్తి..
ప్రీతిరెడ్డి గతంలోనే ఎంపీ పదవి కోసం ఆసక్తి చూపారు. బండి సంజయ్ను ఆమె కలవడం, స్వయంగా పార్లమెంటరీ స్థానం కోరుకుంటున్నట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ గుర్తులోకి వచ్చాయి. మల్లారెడ్డి ఈ సమావేశంలో ప్రధానిని ఆమె పక్షాన కోరుతూ మధ్యవర్తిగా వ్యవహరించారా? ఇది ఒక వైపు లాభదాయకమైన రాజకీయ కుట్రగా కనిపిస్తోంది.
బీజేపీలోకి మల్లారెడ్డి?
ఈ భేటీ ఫలితంగా ప్రీతికి టికెట్ దక్కితే, మల్లారెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందా? బీఆర్ఎస్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఇది పార్టీ మార్పు సూచనగా కనిపిస్తుంది. బీజేపీ తెలంగాణలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటే, స్థానిక నాయకులను ఆకర్షించడం సహజం. అయితే, ఇది బీఆర్ఎస్కు మరో షాక్గా మారవచ్చు.
ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. కుటుంబ ఆధారిత రాజకీయాలు ఎప్పుడూ వివాదాస్పదం. బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పెంచుకోవడం ద్వారా తన పట్టుకు బలం చేకూర్చుకుంటుందా? రానున్న రోజుల్లో ఈ చర్చలు మరింత ఉద్ధృతమవుతాయి.