Andhra Pradesh Election Survey: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. జగన్మోహన్ రెడ్డి సైతం పదేపదే ఇదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిందని.. మరో రెండేళ్లు ఇట్టే గడిచిపోతే వచ్చేది మన ప్రభుత్వమేనని గట్టిగానే చెబుతూ వచ్చారు. అయితే గతంలోనే వై నాట్ 175 అన్న నినాదం ఇచ్చి చతికిల పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి తమదే అధికారం అని చెబుతున్న మాటలు విశ్వాసానికి నోచుకోలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకొని మాట్లాడుతున్నారా? లేకుంటే అతి ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సి ఓటర్ సంస్థ చేపట్టిన సర్వే సంచలనంగా మారింది.
* గత కొద్దిరోజులుగా సర్వే ప్రక్రియ..
ఏపీలో ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షం పనితీరుపై గత కొద్దిరోజులుగా సర్వే చేసింది సి ఓటర్ . దానికి సంబంధించిన ఫలితాలు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. 2014లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. జనసేన, బిజెపితో కలిసి పోటీ చేసింది. అప్పుడు ఆ మూడు పార్టీలకు 55.3% ఓట్లు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వచ్చాయి. ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రారంభం అయింది అని జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. ప్రజల్లోకి ఆ ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు.
* గతం కంటే ఎక్కువ..
అయితే తాజాగా సి ఓటర్ సంస్థ ఒక సంచలన సర్వేను బయటపెట్టింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే కూటమి పార్టీలకు గతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అన్నది దీని సారాంశం. ఏకంగా 57.5% ఓట్లను కూటమి దక్కించుకుంటుందన్నది ఈ సర్వేలో తేలింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 37.5% మాత్రమే ఓట్లు దక్కుతాయని తేల్చింది. ఈ లెక్కన ఆ కూటమి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏకంగా 20% ఓట్ల తేడా కనిపిస్తోంది. అయితే మధ్యలో బిజెపి లేకపోయినా.. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమిదే విజయం అని తేల్చింది ఈ సర్వే. ప్రస్తుతం ఈ సర్వే ను వైరల్ చేస్తున్నారు టిడిపి కూటమి శ్రేణులు.
* విశ్లేషకుల అభిప్రాయం అదే..
అయితే ఈ సర్వే చెప్పిందని కాదు కానీ.. తెలుగుదేశం పార్టీతో జనసేన కొనసాగిన క్రమంలో ఆకూటమిదే విజయం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు.. తాజాగా విశ్లేషకుడు ముసుగులో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా దీనినే తేల్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కరిగిపోయింది. ఆ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు తాజా సర్వేలో అదే స్పష్టమైంది. చూడాలి మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో..