Mahesh Kumar Goud Comments On Revanth Reddy: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు క్రమక్రమంగా బయట పడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. అదే కాదు మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ఉన్న విభేదాలకు బలమైన నిదర్శనమని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.
పీసీసీ చీఫ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను ఆ ఛానల్ ప్రతినిధి ప్రస్తావించారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పారు. రేవంత్ రెడ్డి హిట్లర్ కామెంట్స్ మీద నేను ఏకీభవించను అంటూ మహేష్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు. హిట్లర్ అంటే ప్రపంచం మొత్తం విలన్ గా చూస్తుంటారని.. అలాంటప్పుడు హిట్లర్ వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
హైడ్రా గురించి కూడా ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించగా.. మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగానే సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో ఎవరికైనా అన్యాయం జరిగిందని నా దగ్గరికి వస్తే వారికి కచ్చితంగా న్యాయం చేయిస్తానని మహేష్ కుమార్ గౌడ్ మాటిచ్చారు. అక్రమాలను తొలగించేందుకు హైడ్రా పని చేస్తుందని.. హైడ్రా పనితీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చని.. వాటిని సరి దిద్దుకునే అవకాశం ఉంటే కచ్చితంగా చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో వరుసగా నెగిటివ్ కథనాలు ప్రసారమయ్యాయి. వాటికి మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.. ఈ కథనాల వెనుక కొంతమంది పార్టీ పెద్దల హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పటినుంచి మహేష్ కుమార్ గౌడ్ కొంతమంది పార్టీ నేతలతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కూడా రాజకీయంగా మహేష్ కుమార్ గౌడ్ ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలోనే సదరు న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరి ఈ కోల్డ్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

