Medigadda: మేడిగడ్డకు మళ్లీ మోక్షం.. దిగొచ్చిన ఎల్‌ అండ్‌ టీ.. సొంత ఖర్చుతోనే మరమ్మతు

మేడిగడ్డ కుంగుబాటుతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ మొదట ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన సమావేశంలో కుంగిన బ్లాక్‌ను నిర్మించలేమని ప్రకటించింది.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 3:23 pm

Medigadda

Follow us on

Medigadda: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమిలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో మేడిగడ్డ ఒకటి. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు బ్యారేజీ కుంగిపోవడం.. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ భవిష్యత్‌ కాళేశ్వరమే అని ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌.. మేడిగడ్డ కుంగుబాటుతో కేసీఆర్‌ సర్కార్‌ ఎంత అవినీతికి పాల్పడిందో అన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. మరోవైపు డ్యామేజీని చిన్న సమస్యగా ఆ పార్టీ నేతలు ప్రకటించడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇదే అంశం కాంగ్రెస్‌కు అనుకూలించింది. జాతీయస్థాయిలోనూ మేడిగడ్డ కుంగుబాటు సంచలనం సృష్టించింది.

సంబంధం లేదన్న నిర్మాణ సంస్థ..
మేడిగడ్డ కుంగుబాటుతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ మొదట ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన సమావేశంలో కుంగిన బ్లాక్‌ను నిర్మించలేమని ప్రకటించింది. తమ అగ్రిమెంట్‌ ముగిసిందని ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సమీక్ష చేసింది. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించింది.

చర్చలు సఫలం..
తాజాగా మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని చక్కదిద్దేందుకు ఎల్‌ అండ్‌ టీ ముందుకు వచ్చింది. సొంత ఖర్చుతో మరమ్మతులు చేసేందుకు అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కంపెనీ తరఫున హాజరైన ప్రతినిధులు అనేక అంశాలపై మంత్రితో చర్చించారు. చివరకు సొంత ఖర్చుతోనే మరమ్మతులు చేసేందుకు అంగీకరించారు.

ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు..
మరమ్మతులో భాగంగా ఏయే పనులు చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనలు చేసింది. ఈమేరకు మధ్యంతర నివేదిక ఇచ్చింది. వాటికి అనుగుణంగా ఎల్‌అండ్‌టీ కంపెనీ పనులు చేయనుంది. యుద్ధ ప్రాతిపదికన పనులను మొదలుపెడితే వర్షాకాలం వరద వచ్చే నాటికి పూర్తి చేయవచ్చని మంత్రి సూచించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ డిజైనింగ్‌ లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ నివేదిక తెలిపింది. వీటి సమస్య కూడా పరిష్కరిస్తామని ఎల్‌అండ్‌టీ తెలిపింది.