Congress Vs BRS: తెలంగాణలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ వివాదాన్ని పెద్దది చేసి అధికార పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పరీవాహక ప్రాంత ఉమ్మడి జిల్లా నేతలతో మంగళవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తీరును ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెబ్లీ సమావేశాల్లోనూ అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు నల్లగొండలో ఈనెల 13న లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సభ ద్వారా అటు లోక్సభ ఎన్నికల ప్రచారంతోపాటు ఇటు కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రతివ్యూహం..
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా గులాబీ నేతలు అధికార పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను ఒక్కోదెబ్బ కొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరంపై విజిలెన్స్ వేసిన ప్రభుత్వం తాజాగా గత ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్పై నిందలు వేయడంపై హస్తం నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
దక్షిణ ప్రాజెక్టులపై..
పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ పెద్దగా దృష్టిపెట్టలేదు. తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీ వేదికగానే ఎండగట్టేందకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించాల్సిన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ వివక్షతో దక్షిణ తెలంగాణ కరువు తీరుస్తుందని ఆశపడిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడిది అక్కడే ఉంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఒక మోటార్ ఆన్చేశారు. కానీ, ప్రాజెక్టు పనులు 40 శాతం కూడా పూర్తికలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పది లక్షల ఎకరాలకు నీరందేది. శ్రీశైలం ఎడమగట్టు కాలవు సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కిలోమీటర్లు పూర్తయింది. పది కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా గత పదేళ్లలో ఒక కిలోమీటర్ కూడా పని చేయలేదు. ఇది పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుంది. కేసీఆర్ కావాలనే ఈ పనులు చేయించలేదని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.30 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ఎకరాకు కూడా నీరు అందలేదు. ఇక 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అదీ పనికి రాకుండా చేశారు. మరోవైపు దక్షిణ తెలంగాణ నోట్లో మట్టి కొట్లారని ఎండగట్టాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.