Priyanka Praveen Case: రోజురోజుకు సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. తాత్కాలిక సంబంధాల కోసం.. శాశ్వత అనుబంధాలను వదిలేసుకుంటున్నారు. క్షణకాలంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమె కథ కూడా ఇటువంటిదే. పైగా ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయవాదిగా పని చేస్తోంది. అయినప్పటికీ విచక్షణ మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కుమార్తెను తల్లి అంతం చేసింది. ఈ సంఘటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రియుడితో కలిసి ఉండడానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన చాలా రోజుల క్రితమే జరిగింది. పోలీసుల కళ్ళు కప్పి ఆ తల్లి పరారీలో ఉంది. ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు హాసన ప్రాంతానికి తీసుకొచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని దావనగరి ప్రాంతానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రియాంక లాయర్ గా పనిచేస్తోంది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నారు. వీరు కాడుగూడి ప్రాంతంలో ఉండేవారు. అప్పుడు మోహన్ అనే వ్యక్తి ఈమెని కలిశాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఆ పరిచయంతోనే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
ప్రవీణ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో వారిద్దరినీ అతడు హెచ్చరించాడు. భర్త మాటలు తట్టుకోలేక ప్రియాంక తన కుమార్తెను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మోహన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టింది. అంతేకాదు భర్తకు డైవర్స్ నోటీసులు కూడా పంపించింది. అయితే ఇటీవల ప్రియాంక తన కుమార్తె వెన్నెల చనిపోయిందని భర్తతో చెప్పింది. ఇదే సమాచారం తన సోదరుడికి కూడా చేరవేసింది. అంత్యక్రియల అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్ భర్తకు పంపించింది. అందులో అనేక రకాల అనుమానాలు ఉండడంతో ప్రవీణ్ రిపోర్టును విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి పంపించాడు. ప్రవీణ్ స్నేహితుడు విదేశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఆ పోస్టుమార్టం నివేదికలో అన్ని తప్పులు ఉన్నట్టు అతడు గుర్తించాడు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా.. కీలక విషయాలు బయటకు వచ్చాయి.
వెన్నెలను ప్రియాంక, మోహన్ గొంతు నులిమి చంపేశారని తేలింది. వారిద్దరి ఏకాంతానికి అడ్డుగా ఉందని ఆమెను చంపినట్టు సమాచారం. మోహన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. కొద్దిరోజులుగా ఆమె హాసన ప్రాంతంలో తలదాచుకుంటున్నది. దీంతో పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. మరోవైపు మోహన్ మాయమాటలు నమ్మి ప్రియాంక నిండా మునిగిపోయింది.
మోహన్ డబ్బున్న వ్యక్తి కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతకంటే కాదు. అతడు అద్దెకు ఇల్లు సమకూర్చే బ్రోకర్. ఈ విషయాన్ని తెలుసుకోలేక.. తాత్కాలిక వ్యామోహానికి అలవాటు పడి ప్రియాంక జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రియాంక వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఆమె తీరు పట్లనెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు

