Kaleshwaram inquiry court relief: ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు రెండేళ్గు ఖాళీగా ఉంటున్నాయి. సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ.ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ నియమించింది. 2025 సెప్టెంబర్లో కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు ఐఏఎస్ అధికారుల స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు తీర్పు వారికి భారీగా ఊరటనిచ్చింది. కమిషన్ విచారణా విధానాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది.
పిటిషన్ల నేపథ్యం..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఆరోపణలపై 2024 మార్చి 14న జీవో–6 ద్వారా ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీని చట్టసమ్మతతను సవాల్ చేస్తూ పిటిషనర్లు వాదించారు. వారి వాదనలను పరిగణించకుండా, అధికార పరిధి దాటి విచారణ జరిగిందని. ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విని, ఈ రోజు తుది తీర్పు వెలువరించింది.
ప్రభుత్వ వాదనలు..
ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కమిషన్ను ప్రజాహితం దృష్ట్యా ఏర్పాటు చేసినట్లు, రికార్డుల ఆధారంగా నివేదిక ఇచ్చినట్లు వాదించారు. అయితే కోర్టు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని నిర్ధారించినప్పటికీ, విచారణా ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలను గుర్తించి రిపోర్టును అసమర్థం చేసింది.
కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని, దాన్ని పూర్తిగా నిలిపివేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది బీఆర్ఎస్ నాయకులకు గొప్ప విజయంగా మారింది, రాజకీయ ప్రతీకార చర్యలను అడ్డుకుంది. ఈ తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలకు కొత్త దిశాగా మళ్లింది, ప్రభుత్వం ముందున్న చర్యలను ప్రశ్నార్థకం చేసింది.