HomeతెలంగాణKicks The Drug Lords: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా..!

Kicks The Drug Lords: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా..!

Kicks The Drug Lords: తెలంగాణలోని మందుబాబులకు నిజంగానే కిక్కు దిగిపోయే వార్త వినబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే ప్రతిపాదనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ సైతం ధరల పెంపు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక ఇబ్బందులు పడుతోంది. ఇంకా ఆరు గ్యారంటీలు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. ముందు ముందు ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ప్రమాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్కార్ కొత్తగా ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులోభాగంగానే మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకోవాలని ఆలోచిస్తున్నది.

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా ప్రభుత్వం అనుకుంది. కానీ.. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఇక్కడితో పోల్చితే అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో ఆ ధరలకు తగినట్లుగా ఇక్కడ కూడా మద్యం ధరలను పెంచాలని ఓ అంచనాకు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. అందులోభాగంగానే లిక్కర్ ధరలను సగటున 20-25 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైందట. బీరుపై రూ.15 నుంచి 20, క్వార్టర్‌పై రూ.10 నుంచి 80 వరకు పెంచేలా ఎక్సైజ్ కసరత్తు చేస్తున్నట్లు గెలిసింది. ఇక.. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ శాతంలో పెంపు ఉండనుంది. ఇతర బ్రాండ్లపై ఎక్కువగా బాదుడు ఉండేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయట. ధరల పెంపు వల్ల రాష్ట్రానికి నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దాంతో కొంత వరకైనా ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చన్న అభిప్రాయం ప్రభుత్వంలో కనిపిస్తోంది.

2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ప్రభుత్వానికి రూ.36వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి 6 నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,043 కోట్ల ఆదాయం సమకూరింది. అలా తొలి ఆరు నెలల్లోనే ప్రభుత్వానికి రూ.17,533 కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చే 6 నెలల్లోనూ ఇదే ఆదాయం వస్తే అనుకున్న లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ధరలను పెంచి మరింత ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైన్స్‌లు, బార్లు, క్లబ్‌లు, పబ్‌ల ద్వారా రోజుకు సరాసరి రూ.90 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. నెలకు సగటును రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే.. లిక్కర్ రేట్లు పెంచితే ఈ ఆదాయానికి తోడు.. ప్రతినెలా అదనంగా ఆదాయం వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే.. మద్యం ధరలపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు తయారుచేసినా ఇంకా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular