HomeతెలంగాణAmit Shah: అమిత్‌షాపై కేసు పెట్టిన హైదరాబాద్‌ పోలీసులు

Amit Shah: అమిత్‌షాపై కేసు పెట్టిన హైదరాబాద్‌ పోలీసులు

Amit Shah: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని మోఘల్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉపాధ‍్యక్షుడు జి.నిరంజన్ ప్రధాన ఎన్నికల అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే..
మే 1వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై బీజేపీ కమలం పువ్వు గుర్తు ఉంది. అదే సమయంలో మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఉన్న ప్లకార్డులపై ఆప్ కీ బార్‌ 400 సీట్స్ అని రాసి ఉంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో కొంత మంది బాలికలు వేదికపైకి వచ్చారు. అమిత్‌షా చిన్నారులకు తన వద్దకు రావాలని సైగ చేశారు. దీంతో చిన్నారులు మంత్రి వద్దకు వెళ్లారు. మైనర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఈసీకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

కేసు నమోదుకు ఆదేశం..
కాంగ్రెస్‌ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీనిపై సౌత్ జోన్ డీసీపీ స్నేహామెహ్రా విచారణ జరిపి పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. యమాన్సింగ్, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version