HomeతెలంగాణHyderabad Metro 2nd Phase: మోడీ సార్.. ఫూణేపై ప్రేమ సరే.. హైదరాబాద్ ఏం పాపం...

Hyderabad Metro 2nd Phase: మోడీ సార్.. ఫూణేపై ప్రేమ సరే.. హైదరాబాద్ ఏం పాపం చేసింది?

Hyderabad Metro 2nd Phase: నగర జనాభా పెరుగుతోంది. నగరాలు విస్తరిస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థను కూడా విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె వంటి నగరాల్లో మొదట ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఆకాశ మార్గంపై దృష్టిపెట్టిన కేంద్రం మెట్రోలు ప్రవేశపెట్టింది. అయితే హైదరాబాద్‌లో మెట్రో అందుబాటులోకి వచ్చింది. కానీ ఫేజ్‌2 విస్తరణకు నోచుకోవడం లేదు. తాజాగా పూణెకు ఫేజ్‌2 కు నిధులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్‌ ప్రతిపాదన పక్కన పెట్టింది.

Also Read: ఏపీకి దిగ్గజ ఐటీ సంస్థ.. సంచలన ప్రకటన!

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం విస్మరించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసంతృప్తిని రేకెత్తించింది. అదే సమయంలో, మహారాష్ట్రలోని పుణె మెట్రో రెండో దశకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఈ విషయంలో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కేంద్రానికి సమర్పించి ఎనిమిది నెలలు గడిచినా స్పందన లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకు కారణమైంది.

ఐదు కారిడార్ల ప్రాజెక్టు
హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (2A)లో 76.4 కిలోమీటర్ల పొడవున ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,269 కోట్లుగా అంచనా వేయబడింది. గత ఏడాది జులై 26న రాష్ట్ర మంత్రివర్గం ఈ డీపీఆర్‌ను ఆమోదించింది, నవంబరు 2న పరిపాలనా అనుమతులు జారీ చేసింది. నవంబరు 4న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు డీపీఆర్‌తోపాటు కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ), ట్రాఫిక్‌ అధ్యయన నివేదికలు, ప్రత్యామ్నాయ రవాణా ప్రణాళికలను సమర్పించారు.

ప్రయాణికుల సౌలభ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ
ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజూ 8 లక్షల మంది ప్రయాణికులకు అత్యాధునిక, కాలుష్య రహిత రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడానికి ఈ విస్తరణ అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెబుతోంది.

పుణెకు ప్రాధాన్యం..
కేంద్ర మంత్రివర్గం బుధవారం (జూన్‌ 25, 2025) జరిగిన సమావేశంలో పుణె మెట్రో రెండో దశకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తయితే రోజూ 96 వేల మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని అంచనా. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం ఆమోదం ఇచ్చింది.

హైదరాబాద్‌పై నిర్లక్ష్యం..
హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (2A) ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఎనిమిది నెలలుగా పరిశీలనలో ఉన్నాయి, కానీ ఎటువంటి స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహనిర్మాణ మంత్రిని పలుమార్లు కలిసి ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోరినప్పటికీ, బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సంయుక్త సహకారం
హైదరాబాద్‌ మెట్రో 2A ప్రాజెక్టు వ్యయంలో 30% (రూ.7,313 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం, 18% (రూ.4,230 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించాలని, 48% (రూ.11,693 కోట్లు) జైకా వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల ద్వారా, మిగిలిన 4% పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా సమకూర్చాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అదనంగా, మెట్రో 2Bలో 86.1 కిలోమీటర్ల మూడు కారిడార్ల డీపీఆర్‌లను జూన్‌ 21, 2025న కేంద్రానికి సమర్పించారు.

హైదరాబాద్‌కు అన్యాయం?
హైదరాబాద్‌ మెట్రో విస్తరణ రోజూ 8 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించగల సామర్థ్యం కలిగి ఉండగా, పుణె మెట్రో 96 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చనుంది. అయినప్పటికీ, పుణె ప్రాజెక్టుకు ఆమోదం లభించడం, హైదరాబాద్‌ను విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తికి కారణమైంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ, జనాభా పెరుగుదల దృష్ట్యా మెట్రో విస్తరణ అత్యవసరమని, కేంద్రం నిర్లక్ష్యం రాష్ట్ర అభివద్ధికి ఆటంకమని రాష్ట్రం వాదిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular