ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలపై మొద్దునిద్ర పోతున్న అధికారులు ఉన్నట్టుండి భారీ జరిమానాలు వేస్తుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో స్పెషల్ డ్రైవ్ పేరిట తిరుగుతున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. బ్యానర్లు, హోర్డింగులను తొలగించడంతో పాటు నిర్వాహకులకు భారీ జరిమానాలు విధిస్తూ షాకిస్తున్నారు.
నిబంధనలు పాటించడం లేదంటూ కూకట్పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్కు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకంగా రూ.4లక్షల జరిమానా విధించారు. సుజనా మాల్స్కు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ జరిమానా పేరిట మొత్తంగా రూ.16 లక్షల50వేల జరిమానా విధించినట్లు తెలస్తోంది. దీంతోపాటు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కు రూ. 2లక్షలు.. బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్కు రూ. 2లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ అధికారులు విధించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు భారీ జరిమానాలు విధిస్తుంటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. నగరంలో నిత్యం స్పెషల్ డ్రైవ్ చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడాల్సి అధికారులు తుతుమంత్రంగా జరిమానాలు విధిస్తుండటపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. అధికారులు కొద్దిరోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం కామన్ అయిపోయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.