Srinivas Goud: మంత్రిగారి మనిషి మరి.. పది సంవత్సరాలుగా ఆఫీసుకు రాకున్నా జీతం ఇచ్చారు!

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ల్యాబ్ అటెండెంట్ గా పని చేస్తున్న సత్యనారాయణ గౌడ్ అనే ఉద్యోగి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు దగ్గరి బంధువు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 3, 2024 1:21 pm
Follow us on

Srinivas Goud: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఉండదు. ఇవే సామెతలను ఆ మంత్రి అని నిజం చేసి చూపించారు. భారత రాష్ట్ర సమితిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి ఎక్సైజ్, క్రీడల మంత్రిగా పనిచేసిన ఆయన.. కొన్ని శాఖల్లో తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుంటే.. ఆ వ్యక్తి అక్కడ శిక్షణ పొందుతున్న యువతులను ఇబ్బంది పెట్టేవాడు.. దానికి సంబంధించి అప్పట్లో పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత స్పందించడంతో అప్పుడు మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఆగ మేఘాల మీద స్పందించారు. అతనిపై వేటు వేశామని ట్విట్టర్ ద్వారా కవితకు బదులిచ్చారు. ఎమ్మెల్సీ కవిత స్పందించింది కాబట్టి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ విషయంలో స్పందించారు. లేకుంటే విషయం వేరే తీరుగా ఉండేది.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ల్యాబ్ అటెండెంట్ గా పని చేస్తున్న సత్యనారాయణ గౌడ్ అనే ఉద్యోగి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు దగ్గరి బంధువు. దీంతో ఆయన అండ చూసుకొని సత్యనారాయణ గౌడ్ 10 సంవత్సరాలుగా అసలు ఆఫీస్ కే వెళ్లలేదు. సంతకం పెట్టి వేతనం మాత్రం దర్జాగా తీసుకునేవాడు. మంత్రికి దగ్గర బంధువు కావడంతో మిగతా ఉద్యోగులెవరూ నోరు మెదిపేవారు కాదు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో జరిగిన అవకతవకలపై చాలామంది నోరు విప్పుతున్నారు. ఇక సత్యనారాయణ గౌడ్ ఉదంతానికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహేష్ కుమార్ రాష్ట్ర సర్కార్ కు ఫిర్యాదు చేశారు .

ఇటీవల జెన్కోలో మహిళకు ఎటువంటి పరీక్ష రాయకున్నా ఏఈ ఉద్యోగం ఇవ్వటం చర్చనీయాంశం కావడం.. దానిపై ప్రభుత్వం స్పందించడంతో గత పాలకుల వ్యవహారం మరోసారి బయటపడింది. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అటెండ్ గా పని చేస్తూ.. కార్యాలయానికి రాని సత్యనారాయణ గౌడ్ ఉదంతం కూడా బయటికి వచ్చింది. అతడి పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ రాశారు. అప్పట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ చూసుకొని సత్యనారాయణ గౌడ్ నెలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకునేవాడని లేఖలో పేర్కొన్నారు. దీనికి ఐపిఎం డైరెక్టర్ శివ లీల, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుమార్ సహకరించేవారని.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ కోరారు. మహేష్ కుమార్ లేఖ రాసిన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంత్ మెడిసిన్ విభాగంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. కిందిస్థాయి ఉద్యోగులపై కూడా దృష్టి సారించి పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు వ్యక్తవుతున్నాయి.