KCR: కాంగ్రెస్‌ ఫెయిలయ్యింది.. ఇక కేసీఆర్‌ బయటకొస్తాడా..

పది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ పూర్తిగా సైలెంట్‌ అయ్యారు.

Written By: Raj Shekar, Updated On : September 28, 2024 12:34 pm

KCR

Follow us on

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పది నెలలు పూర్తయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 65 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక అధికార బీఆర్‌ఎస్‌ 39 సీట్లకు పరిమితమైంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడడంతో తుంటి విరిగింది. ఆపరేషన్‌ తర్వాత మూడునాలుగు నెలలు బెడ్‌కే పరిమితమయ్యారు. అయిలే లోక్‌సభ ఎన్నిలవేళ మూడు నెలల క్రితం కేసీఆర్‌ ప్రచారం కోసం చేతికర్రసాయంతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. అయితే అప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ అప్పటికే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి పాలన చేతకాదని, త్వరలోనే వైఫల్యాలు కనిపిస్తాయని, ప్రజలు ఇబ్బందులు పడతారని, కాంగ్రెస్‌ను ఎన్నుకున్నందుకు బాధపడతారని తెలిపారు. మనం పార్టీని అంటిపెట్టుకుని ఉంటే చాలని, ప్రజలే టార్చ్‌ వేసుకుని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తారని తెలిపారు.

తెలంగాణ భవన్‌కు మూసీ బాధితులు..
మూడు నెలల క్రితం కేసీఆర్‌ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్‌ సర్కార్‌ మూసీ నదిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసేందుకు మార్కు చేయిస్తున్నారు. బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్నారు. కానీ, చాలా మంది ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. మార్కింగ్‌ చేయడానికి వచ్చిన అధికారులపై తిరగబడుతున్నారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇక కొంత మంది బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారు. తమ తరఫున ప్రభుత్వంపై పోరాడాలని తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. దీంతో కేసీఆర్‌ మూడు నెలల క్రితం చెప్పినట్లే.. ప్రభుత్వ బాధితులు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వద్దకు వెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌కే పరిమితం..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ సర్కార్‌ బాధితులు ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. మూసీ బాధితులే ఎక్కువ. రుణమాఫీ కాని రైతులు ఉన్నా.. వారు విపక్ష నేతల సాయం కోరడం లేదు. ఇక మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ పరిధదిలో ఒక్క సీటు కూడా రాలేదు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. అయినా రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కు తగ్గడం లేదు. పార్టీ గెలుపు ఓటములను ఆలోచించకుండా హైదారబాద్‌ను అందంగా తీర్చిదిద్దడం, మూసీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఆక్రమణదారులకు అండగా..
ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆంక్రమణదారులకు అండగా ఉంటామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఆక్రమణల గురించి మాట్లాడారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వాటినే తొలగిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆక్రమణదారులకు బీఆర్‌ఎస్‌ కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నారు.

కేసీఆర్‌ రాకే మిగిలింది..
లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఒకసారి బయటకు వచ్చారు. అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూసీ బాధితుల ఆందోళన నేపథ్యంలో కేసీఆర్‌ బయటకు వస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. రావాలని కూడా బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుతున్నారు.