spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌ మైండ్‌గేమ్‌.. బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి!

CM Revanth Reddy: రేవంత్‌ మైండ్‌గేమ్‌.. బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి!

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారా..? ఆరు గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా? బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసే వ్యూహం అమలు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్‌ వర్గాల నుంచి. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరిని చూసి, ఓడిపోయిన మంత్రులు, నాయకులు, నేతలు కూడా కాంగ్రెస్‌పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అయితే ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ సర్కార్‌ను నిత్యం నిలదీస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపైనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా గమనిస్తూ వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మైండ్‌ గేమ్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఒకవైపు కాళేశ్వరం అవినీతి..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.80 వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అన్నారం బ్యారేజీ వద్ద బుంగలు పడ్డాయి. సుందిళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు మొదలు పెట్టింది. ఈమేరకు విజిలెన్స్‌ను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటిని హైదరాబాద్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్‌లో భయం మొదలైంది.

రెండు మూడు రోజుల్లో మధ్యంతర నివేదిక..
కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను రెండ మూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత విచారణ కోసం ఒకరిద్దరిని అరెస్ట్‌ కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైంది.

తాజాగా ఎమ్మెల్యేల వ్యవహారం..
ఒకవైపు కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుండగా, మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలవడం గులాబీ పార్టీని మరింత టెన్షన్‌ పెడుతోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్‌ను కలవడం ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీలో, అటు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుది. బీజేపీ నేత రఘునందన్‌రావు అయితే ఓ అడుగు ముందుకు వేసి మాజీ మంత్రి హరీశ్‌రావే వారిని సీఎం రేవంత్‌ వద్దకు పంపించారని ఆరోపించారు. త్వరలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన కామెంట్స్‌ చేశారు.

కలుపుకుపోతామంటున్న కాంగ్రెస్‌..
మరోవైపు నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ స్పందించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎవరైనా సీఎంను కలవొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కలుపుకుపోతామని శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఒకవైపు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌ను వరుస పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా పని చేసుకుపోతుండడం ఇప్పుడు రాజకీయాల్లో కాక రేపుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular