New Ration Cards: కొత్త రేషన్‌ కార్డులపై బిగ్‌ అప్డేట్‌.. రెండు రోజుల్లో విధి విధానాలు.. అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డులు మినహా ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయలేదు. కార్డు ఉన్నవారి పిల్లల పేర్లు కూడా చేర్చలేదు.

Written By: Raj Shekar, Updated On : July 31, 2024 9:03 am

New Ration Cards

Follow us on

New Ration Cards: తెలంగాణ అసెంఈ్ల ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేస్తామని నాటి పీసీసీ చీఫ్‌.. నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. పదేళ్లలో రేషన్‌ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆరు గ్యారంటీలతోపాటు అనేక హామీలు ఇవ్వడం, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని డిసైడ్‌ అయ్యారు. కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌న గద్దె దించి.. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడునెలలైనా కొత్త రేషన్‌కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసర ఇచేస్తోంది. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలను రేషన్‌కార్డు ఉన్నవారికే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ విషయంలో కూడా మొదట రేషన్‌కార్డు నిబంధన తెచ్చారు. కానీ, తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇలా ప్రతీ ప్రభుత్వ పథకానికి రేషన్‌కార్డు తప్పనిసరి అయిన నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలు కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం ఎదుచు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

అసెంబ్లీలో ప్రకటన..
తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అభయహస్తం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మధ్యలో లోక్‌సభ ఎన్నికలు రావడం, తర్వాత రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో రేషకార్డుల జారీ విషయంలో జాప్యం జరిగింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఈమేరకు ఆగస్టు 1వ తేదీన నిర్వహించే కేబినెట్‌ సమావేశంలో రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.

అందరికీ సన్నబియ్యం..
అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేసిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వలన ఆ బియ్యం రీసైక్లింగ్‌ అవుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు, లిక్కర ఫ్యాక్టరీలకు తరలిపోతున్నాయని తెలిపారు. సన్న బియ్యం పంనిణీ చేస్తే అందరూ తీసుకోవడంతోపాటు తింటారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా..
ఇక రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా పేదలందరికీ ఆరోగ్యశ్రీకార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో నిర్వహించే కేబినెట్‌ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు వేర్వేరుగా జారీ చేస్తామని తెలిపారు. మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు తెలిపారు,