Dharmapuri Arvind
Dharmapuri Arvind : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ఆయన కూతురు.. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2019 లోక్సభ ఎన్నికల్లో నిజాబాబాద్లో ఓడించి సంచలనం సృష్టించాడు ధర్మపురి అరవింద్. పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసి ఇచ్చి.. కాస్త ఆలస్యంగా అయినే బోర్డు సాధించాడు. ఇదే 2024 లోక్సభ ఎన్నికల్లోనూ అరవింద్ను మళ్లీ నిజామాబాద్ ఎంపీగా గెలిపించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన అరవింద్.. రెండోసారి ఎంపీగా గెలిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించాడు. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పెద్దగా కష్టపడలేదు. ఎంపీగా గెలవడంపైనే దృష్టిపెట్టారు. ఈ క్రమంలో నిజామాబాద్ ఓటర్లు గెలిపించి పార్లమెంటుకు పంపిచారు. కానీ, కేంద్ర మంత్రి కావాలన్న అరవింద్ ఆశ మాత్రం నెరవేరలేదు.
విధేయతకు పెద్దపీట..
తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతానని అర్వింద్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్నారు. ఈసారి తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని చెప్పుకున్నారు. ఇది కూడా ఆయన విజయానికి దోహదపడింది. అయితే సామాజిక కోణం కలిసి వచ్చినా.. విధేయత విషయంలో సంజయ్తో పోల్చుకుంటే వెనుకపడ్డాడు. అయితే బండికి ఇప్పటికే జాతీయ కార్యదర్శి పదవి ఉన్నందున మంత్రి పదవి ఖాయమనుకున్నాడు. కానీ, మరో బీసీ నేత ఈటల ఉన్నా కొత్తగా పార్టీలోకి వచ్చినందున తనకే ఛాన్స్ దక్కుతుందని ఆశపడ్డాడు.
బీజేపీని బలోపేతం చేసిన సంజయ్కే..
బీసీ కోటాతో సంజయ్, లక్ష్మణ్, అరవింద్, ఈటల రాజేందర్ వంటి కీలక నేతలు ఉన్నా.. డీకే ఆరుణ, కిషన్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. కానీ, అధిష్టానం మాత్రం సంజయ్వైపే మొగ్గు చూపింది. పార్టీ అధ్యక్షుడిగా 8 ఎంపీ సీట్లు గెలిపించిన కిషన్రెడ్డి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి 8 ఎమ్మెల్యేలు గెలిచేలా చేసిన సంజయ్కు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆరవింద్ ఆశలకు గండి పడింది.