Ramoji Rao – Eenadu Group : “రామోజీ చనిపోయాడు. ఇక ఆయన నిర్మించుకున్న సౌధాలు మొత్తం ఒక్కొక్కటిగా ముక్కలవుతాయి. ఆయన కంపెనీలు వేర్వేరు అవుతాయి. మీరు చూస్తూ ఉండండి” రామోజీరావు చనిపోయిన తర్వాత వైసిపి నాయకులు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలవి. కానీ అవి నిజం కావని, నిజం అయ్యేందుకు ఆస్కారం లేదని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది.. ఎందుకంటే తాను జీవించి ఉన్నప్పుడే నివేశన స్థలాన్ని నిర్మించుకున్న రామోజీరావు.. తాను ఏర్పాటు చేసిన సంస్థల బాధ్యతలను కూడా తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి అప్పగించారు.. రామోజీరావు చనిపోయి నేటికీ సరిగ్గా నెల రోజులు. ఈ నెల రోజుల్లో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. ఎవరి పనుల్లో వారు తల మునుకలైపోయారు.
రామోజీ చనిపోయిన నేపథ్యంలో ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆయన కుమారుడు కిరణ్ నేతృత్వం వహిస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గా మొన్నటిదాకా రామోజీరావు కొనసాగిన నేపథ్యంలో.. ఆయన గౌరవార్థం ఆస్థానాన్ని ఖాళీగా ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.. ఇక చాలాకాలంగా ఈనాడు ఎండిగా కిరణ్ కొనసాగుతున్నారు. ఆ సంస్థ పై ఆయన పూర్తిస్థాయిలో పట్టు సాధించారు.. ఈటీవీ నెట్వర్క్ ఛానల్స్ ను బాపినీడు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈనాడు గ్రూప్ ప్రారంభించిన ఓటిటి ఫ్లాట్ ఫారం అయిన ఈటీవీ విన్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. ఈనాడు, ఈటీవీకి సంబంధించి బలమైన సంపాదకీయ బృందాన్ని రామోజీరావు ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇప్పటికీ ఈనాడు, ఈటీవీ రోజువారీ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇక మార్గదర్శి సంస్థను కిరణ్ సతీమణి శైలజ చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. రామోజీరావు మరో కోడలు (దివంగత సుమన్ సతీమణి) రామోజీ ఫిలిం సిటీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రామోజీరావు మనవరాలు బృహతి (కిరణ్ కుమార్తె) ఈటీవీ భారత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. డాల్ఫిన్ హోటల్స్ ను సోహానా(దివంగత సుమన్ కుమార్తె పర్యవేక్షిస్తున్నారు. ప్రియా ఫుడ్స్ ను సహారి (కిరణ్ మరో కుమార్తె) నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి తన తర్వాతి తరానికి.. తాను బతికి ఉన్నప్పుడే రామోజీరావు వ్యాపార పగ్గాలను చేతుల్లో పెట్టారు. వారికి తన అనుభవాలను ఎప్పటికప్పుడు చెప్పారు. అందువల్లే రామోజీరావు గతించినప్పటికీ కూడా ఆయన గ్రూపు సంస్థలు చెక్కుచెదరలేదు. పైగా మరింత వ్యాపార దక్షతతో ముందడుగు వేస్తున్నాయి.. యువతరానికి పగ్గాలు అప్పజెప్పడంతో.. రామోజీ గ్రూప్ సంస్థల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి బలమైన నిదర్శనం ఈటీవీ భారత్.. ఇక 1962లో ప్రారంభమైన ఈనాడు నేటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ.. అది మరింత ఉజ్వలంగా దూసుకెళ్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More