Homeఆంధ్రప్రదేశ్‌Rk Kotta Paluku: జగన్ ను అలా అనడం తప్పు.. బాలకృష్ణకు సభా మర్యాదలు తెలియవా?

Rk Kotta Paluku: జగన్ ను అలా అనడం తప్పు.. బాలకృష్ణకు సభా మర్యాదలు తెలియవా?

Rk Kotta Paluku: అప్పట్లో ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల మీద నిషేధం ఉండేది.. ఇది కొంతకాలం పాటు సాగింది. ఇటీవల ఆ నిషేధం ఎత్తేశారు. చంద్రబాబు మీద ప్రేమ ఉండి.. బాలకృష్ణ మీద ద్వేషం కలగడం ఏంటో.. అసలు వేమూరి రాధాకృష్ణకు.. బాలకృష్ణకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు.. అందువల్లే కావచ్చు తాజా ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బాలకృష్ణ మీద అమాంతం లేచారు. మర్చిపోతున్న విషయాన్ని మరోసారి గెలికారు. సింపుల్ గా చెప్పాలంటే మానిపోతున్న గాయం మీద కారం వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఇటీవల శాసనసభలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సైకో గాడు అంటూ మండిపడ్డారు. స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని జుట్టు మీద గాగుల్స్ పెట్టుకొని.. అలా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటని అవి సభ మర్యాదలు ఎలా అవుతాయని రాధాకృష్ణ ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయి అంటూ వాపోయారు. “బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు.. నాటి నగర కమిషనర్ ఆర్పి సింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదుట ఒక నివేదిక ఉంచారు. ఆ నివేదికను చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నవ్వి ఊరుకున్నారు.. చర్యలు ఏమొద్దులేవయ్యా అంటూ నగర కమిషనర్ కు సూచించారు. నాటి ఆ ఘటనలో బాలకృష్ణను కాపాడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణకు కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉంది జగన్.. బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి” ఇలా కీలక విషయాలను బయటపెట్టారు వేమూరి రాధాకృష్ణ.

బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని.. పేరుకు పరామర్శ అయినప్పటికీ.. అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని వేమూరి రాధాకృష్ణ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆయనను చల్లపరచడానికే చంద్రబాబు ప్రయత్నించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు.. బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు. కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రాధాకృష్ణ బయటపెట్టారు. రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాసం రాశారు కాబట్టి దీనిని వైసిపి నాయకులు మరింత ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే తొలిసారి ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ బాధిత పక్షంగా కనిపించారు కాబట్టి వైసిపి ఊరుకోదు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం వదులుకోవడం లేదు. కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ప్రచురిస్తున్నారు. తన చానల్లో ప్రసారం చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా రాధాకృష్ణ వెనుకాడటం లేదు. రాధాకృష్ణలో ఈ మార్పును చూసిన కూటమినేతలు ఆశ్చర్యపోతున్నారు. తాజా కొత్త పలుకులో కూడా వేమరి రాధాకృష్ణ అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు. దీంతో కూటమినేతలకు మరోసారి షాక్ తగిలినట్టే. అన్నట్టు ఏపీలో కులాల కుంపట్లు ఇప్పుడే కొత్తగా ఉన్నాయా.. గతంలో లేవా.. కులాల కుంపట్ల మీద చలికాచుకున్న వారిలో ఎంతమంది లేరు.. ఇప్పుడే ఏపీలో ఆ జాడ్యం మొదలైనట్టు రాధాకృష్ణ చెప్పడం భలే వింతగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version