Ponguleti Srinivasa Reddy : డామిట్ కథ అడ్డం తిరిగిందా…? ‘పొంగులేటి’ పొలిటికల్ జర్నీలో జర్క్

పొంగులేటి ఆర్థిక మూలాలు కాపాడుకునేందుకు బిజెపి పార్టీనే బెటర్ జడ్జిమెంట్ గా భావిస్తున్నట్లు ఆత్మీయులు చెబుతున్నారు. కాని ఊహించని విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో ఇపుడు తన నిర్ణయంపై ధర్మసకంటంలో పడినట్లు గుసగుసలు వినవస్తున్నాయి.

Written By: Raghava Rao Gara, Updated On : May 17, 2023 11:23 am

Ponguleti Srinivasa Reddy

Follow us on

Ponguleti Srinivasa Reddy :  మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ జర్నీ కుదుపులకు గురవుతోందా..? కాషాయాం…కాంగ్రెస్ పార్టీల మధ్యలో పొంగులేటి నలిగిపోతున్నారా..? ఆర్థిక మూలాలను కాపాడుకోవాలా…క్యాడర్ చెప్పే మార్గం ఎంచుకోవాలా తెలియక సతమతమవుతున్నారా..? కర్ణాటక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా..? లాంటి ప్రశ్నలకు పొలిటికల్ ఎనలిస్టులు ఎస్ అనే సమాధానమే ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదిన కెసిఆర్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించిన పొంగులేటి ఆరు నెలలు గడుస్తున్నా..ఫ్యూచర్ పొలిటికల్ జర్నీపై తర్జనబర్జన పడుతున్న వైనం మాత్రం ఆయన్ని నమ్ముకున్న అనుచరుల్లో అయోమయానికి గురిచేస్తోంది. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర తెలంగాణా జిల్లాలో ఎంతోకొంత ప్రభావం చూపగల ఆర్థిక, అంగబలం ఉన్న పొంగులేటి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటూ పొలిటికల్ పంచులు విసురుతూ తన అనుచర వర్గంలో జోష్ నింపుతున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన చిరకాల మిత్రుడు మహబుబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జూపల్లి క్రిష్ణారావు జత కట్టడం ఇద్దరు నేతలు కలిసి భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి పడేస్తారనే ఊహాగానాలకు తెరతీసింది. జూపల్లితో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ అసమ్మతి నేతలు కూడా తనకు టచ్ లో ఉన్నారని పొంగులేటి చేసిన కామెంట్స్ తో కెసిఆర్ టీమ్ అప్రమత్తమై పొంగులేటి కదలికలపై నిఘా పెంచింది. ఆయనతో కీలక నేతలెవరూ వెళ్లకుండా కట్టడి చేసింది. దీంతో ద్వితియ శ్రేణి నాయకులు, క్యాడర్ తో పడుతు..లేస్తూ సాగుతున్న పొంగులేటి ప్రయాణం ఏ పార్టీ జెండా కిందికి చేరుతుందో అనే అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

తనతో బిజెపి…కాంగ్రెస్ అగ్ర నేతలు టచ్ లో ఉన్నారంటూ ఊరిస్తూ వస్తున్న పొంగులేటి మనసులో మాట మాత్రం రోజులు గడుస్తున్నా బయటకు రాకపోవడం ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగిపోయింది. ఉందిలే మంచికాలం ముందు ముందునా అంటూ కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకూ పార్టీ మారే విషయంపై తన క్యాడర్ ని ఊరిస్తూ వచ్చిన పొంగులేటి ఇపుడు కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నం కావడంతో తీవ్రమైన అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న తన వ్యాపార భాగస్వామి ఈటెల రాజెందర్ టీమ్ ఖమ్మం వచ్చి చర్చలు జరిపినపుడే కాషాయం గూటికి చేరాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు రాహుల్ గాంధీ పొలికల్ కోర్ టీమ్ కూడా పొంగులేటితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. తన పార్టీ మార్పుపై ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా తన మేలుకే అన్న చందంగా ఉన్న పొంగులేటి ఆర్థిక మూలాలు కాపాడుకునేందుకు బిజెపి పార్టీనే బెటర్ జడ్జిమెంట్ గా భావిస్తున్నట్లు ఆత్మీయులు చెబుతున్నారు. కాని ఊహించని విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో ఇపుడు తన నిర్ణయంపై ధర్మసకంటంలో పడినట్లు గుసగుసలు వినవస్తున్నాయి. కర్ణాటకలో బంపర్ మెజార్టీతో గెలిచినా సిఎం కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్న తీరు భవిష్యత్ రోజుల్లో తెలంగాణాలో కూడా ఎదురయితే ఎట్లా..? అనే అనుమానాలు పొంగులేటికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని సమాచారం.

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎత్తుకోవాలా..? కాషాయం గూటికి చేరుకోవాలా అనే అంశంపై ఈనెల 21న ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమావేశంలో తేల్చియాలనే ధ్రుడ సంకల్పంతో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఇంకా నాన్చివేత ధోరణి అనుసరిస్తే ఉన్న క్యాడర్ కూడా జారీపోయే ప్రమాదముందనే సంకేతాలు వెలువడుతుండటంతో పొంగులేటి కీలక ప్రకటన చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచానం. మరి ఖమ్మంలో జరిగే సమావేశంలో పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తారా..? లేదా అదే సందిగ్థతన మరికొంత కాలం కొనసాగిస్తారా తెలియాలంటే పొంగులేటి నోరు విప్పాల్సిందే..!!