TGRTC : తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కరీంనగర్ బస్టాండ్లో పుట్టిన చిన్నారికి జీవితాంతం ఉచిత బస్పాస్ ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ప్రకటించారు. ఇక బస్టాండ్లో మహిళకు ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బందిని తెలంగాణ బస్ భవన్లో సత్కరించారు.
నిబంధనల మేరకు..
ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలం బస్పాస్ ఇవ్వాలని గతంలోనే యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే కరీంనగర్ బస్టాండ్లో ఇటీవల పుట్టిన ఆడ శిశువుకు బర్త్ గిఫ్ట్గా లైఫ్టైం ఫ్రీ బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ఏం జరిగిందంటే..
జూన్ 16న కుమారి అనే గర్భిణి భర్తతో కలిసి భద్రాచలం బస్సులో కుంట వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్కు చేరుకుంది. ఈ సమయంలోనే ఆమెకు పురిటి నొప్పలు రావడంతో భర్త ఆమెను ఓ పక్కన పడుకోబెట్టి సాయం కోసం అర్థించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది, మహిళా ఉద్యోగులు చీరలు అడ్డుగా కట్టి సపర్యలు చేశారు. 108కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో కుమారి బస్టాండ్లోనే ప్రసవించింది. తర్వాత అంబులెన్స్ రావడంతో తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. ఆపద సమయంలో ఆర్టీసీ సిబ్బంది సేవాతత్పరత చాటడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More