
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్కదానిలోనూ పంటలకు కనీస మద్దతు ధరపై హామీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే పార్లమెంటులో తాము వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని, ఎప్పటికీ తాము ఆ బిల్లులకు వ్యతిరేకమేనని కవిత చెప్పారు. కొత్త చట్టాలు మండీల సంస్కృతిని ధ్వంసం చేసేలా ఉన్నాయని, మండీలు కనుమరుగైతే దేశంలో వాటికి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకే రైతులు అభద్రతా భావంతో బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు.