How To Recharge Mobile In Whatsapp: మొబైల్ లో Whatsapp తప్పనిసరిగా మారింది. వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటోంది. ఇప్పటి వరకు ఇందులో ఫొటోలు, వీడియోల తో పాటు మనీ ట్రాన్జాక్షన్ అవకాశం కూడా ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ తీసుకువస్తోంది. ఇప్పుడు వాట్సాప్ లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకునేందుకు కొత్త ఫీచర్ను భారత్లో ప్రారంభించింది. PayU భాగస్వామ్యంతో ఈ సేవను తీసుకొస్తుండగా, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులు పూర్తి రీఛార్జ్ చేసుకునే వీలు కలుగుతోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్లో డిజిటల్ చెల్లింపులు, దైనందిన సేవలను ఒకే వేదికపై అందించాలన్న లక్ష్యంతో వాట్సాప్ మరో కీలక అడుగు వేసింది. ఇకపై ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు వాట్సాప్ యాప్లోనే నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఈ సేవను PayUతో భాగస్వామ్యంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు దశల వారీగా అందుబాటులోకి వస్తోంది. రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ ఈ సౌకర్యం చేరుస్తామని కంపెనీ వెల్లడించింది. దీంతో యూజర్లు వేర్వేరు యాప్స్ మారాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రస్తుతం ఈ సేవలు జియో, ఎయిర్టెల్, Vi ప్రీపెయిడ్ కనెక్షన్లకు అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ నంబర్కే కాకుండా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నంబర్లకూ అందుబాటులో ఉన్న ప్లాన్లలో ఒకదాన్ని ఎంచుకుని రీఛార్జ్ పూర్తి చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వాట్సాప్ హోమ్ స్క్రీన్పై రూపాయి గుర్తు (₹) రూపంలో ప్రత్యేక యాక్సెస్ పాయింట్ను కూడా జోడించింది. ఈ ఐకాన్ ద్వారా చెల్లింపులు, రీఛార్జ్ సేవలను త్వరగా యాక్సెస్ చేయవచ్చని సమాచారం. అలాగే వన్-టు-వన్ చాట్లలో UPI ద్వారా డబ్బు పంపే ఆప్షన్ కూడా అందుబాటులోనే ఉంటుంది.
మెటా ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ తెలిపిన ప్రకారం.. యూజర్లు అనేక యాప్స్ మధ్య తిరగకుండా అవసరమైన సేవలను వాట్సాప్లోనే పూర్తి చేసుకునేలా చేయడం ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. PayU కూడా యూజర్లు ఎక్కువ సమయం గడిపే ప్లాట్ఫాంల్లోనే చెల్లింపులను సహజంగా మిళితం చేయడం ఉత్తమ అనుభవమని పేర్కొంది. ఇప్పటికే వాట్సాప్ భారత్లో మెట్రో టికెట్ బుకింగ్, బిల్ పేమెంట్స్, ప్రభుత్వ సేవలు వంటి అనేక యుటిలిటీ ఫీచర్లను చాట్బాట్ల ద్వారా విస్తరిస్తోంది. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ను జోడించడం ద్వారా రోజువారీ చిన్నచిన్న కానీ ఎక్కువగా జరిగే ట్రాన్సాక్షన్లలో తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
డిజిటల్ పేమెంట్స్ రంగంలో PhonePe, Google Pay వంటి ప్లాట్ఫాంలతో పోటీ ఉన్న సమయంలో వాట్సాప్ ఈ అడుగు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 500 మిలియన్లకు పైగా యూజర్లున్న భారత మార్కెట్లో చాట్, పేమెంట్స్, సేవలను ఒకే యాప్లో కలపడం ద్వారా వినియోగాన్ని పెంచాలని మెటా భావిస్తున్నట్టు టెక్ రంగ విశ్లేషణలు సూచిస్తున్నాయి.