Social Media Reels Rules In India: సోషల్ మీడియా ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోంది. సోషల్ మీడియా చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విజువల్ కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోయారు. వినోదం నుంచి మొదలు పెడితే విజ్ఞానం వరకు ప్రతి విషయంలో కూడా రీల్స్ చేసేవారు పెరిగిపోయారు.
Also Read: ఢిల్లీ వెలుపల భారీ పవర్ సెంటర్ గా ‘అమరావతి’
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా రీల్స్ చేసేవారిలో కొంతమంది అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. అభూత కల్పనలకు దిగుతున్నారు. దీనివల్ల సమాజంలో అల్లకల్లోలం చెలరేగుతుంది. ఇటీవల కాలంలో ఈతరహా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దీనికి భారత్ మినహాయింపు కాదు. అయితే ఆదిలోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని కేంద్రం భావించింది. అందువల్లే సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకురావాలని భావిస్తుంది.
సంవత్సరానికి సంబంధించిన చట్టంలో కేంద్రం పలు సవరణలు తీసుకురాబోతోంది. ఇప్పటివరకు వార్తాపత్రికలు.. న్యూస్ చానల్స్ మాత్రమే తాము ప్రచురించిన.. ప్రసారం చేసిన వార్తలకు బాధ్యత వహించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ జాబితాలోకి సోషల్ మీడియా కూడా చేరనుంది. ముఖ్యంగా రీల్స్ చేసేవారు ఇకపై తాము సృష్టించిన కంటెంట్ మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అసత్య.. నిరాధార.. అభూత కల్పనలతో సృష్టించే రీల్స్ పెరిగిపోయాయి. వీటివల్ల సమాజంలో అల్లర్లు.. అశాంతి.. హింస చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్లే రీల్స్ విషయంలో కూడా కఠినంగా ఉండబోతోంది.
కొత్తగా తీసుకొచ్చే నిబంధనల వల్ల రీల్స్ చేసేవారు తమ కంటెంట్ మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు సృష్టించిన కంటెంట్ అబద్ధమో, నిజమో తేల్చాల్సిన బాధ్యత ఆ ఫ్లాట్ ఫామ్ నిర్వాహకుల మీద ఉంటుంది. వారు ఒక ఫ్యాక్ట్ చెక్ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి రీల్ ను ఆయా ప్లాట్ఫారం సంస్థలు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
కేంద్రం తన విధానాన్ని సమర్థించుకుంటుండగా.. కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.. తప్పుడు సమాచారానికి కట్టడివేసే క్రమంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని.. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని కొందరి వాదన. దీనివల్ల కంటెంట్ సృష్టించేవారు ఇబ్బంది పడతారని.. అప్పుడు సమాచార వ్యాప్తి అనేది ఉండదని వారి ఆందోళన. దీనిపై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం తప్పుడు సమాచారాన్ని మాత్రమే తాము అడ్డుకుంటున్నామని.. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం తమ విధానం కాదని కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే కొన్ని రీల్స్ వ్యంగ్యంగా ఉంటాయి.. కామెడీగా ఉంటాయి. సెటైరికల్ గా ఉంటాయి.. అటువంటి వాటిని కూడా తప్పుడు సమాచారంగా ప్రకటిస్తారా అంటూ కంటెంట్ క్రియేటర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
కేంద్రం తీసుకొస్తున్న నిబంధన ప్రకారం కంటెంట్ క్రియేటర్లు అడ్డగోలుగా ప్రవర్తిస్తే ముందుగా హెచ్చరిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు సోషల్ మీడియా ఎకౌంటు బ్యాన్ చేస్తారు. అప్పటికి పరిస్థితి మారకపోతే ఎకౌంటు శాశ్వతంగా నిషేధ జాబితాలోకి పంపిస్తారు. ఒకవేళ ఆ కంటెంట్ హింసాత్మక ఘటనలకు కారణమైతే.. దానిని సృష్టించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. అవసరమైతే విచారిస్తారు. ఇంకా లోతైన వ్యవహారాలు దాగి ఉంటే చర్యలు తీసుకుంటారు. అందువల్ల రీల్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అసత్యమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తే తదుపరి చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.