Jio : దేశంలో నంబర్ వన్ గా జియో.. ముఖేష్ కల సాకారమైనట్టేనా?

తన మానస పుత్రిక లాంటి జియో ఈ స్థాయిలో విజయవంతం కావడంతో ముకేశ్ అంబానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన సంస్థ ప్రపంచ స్థాయిలోనే చైనా మొబైల్ కంపెనీతో పోటీపడి.. మొదటి స్థానంలోకి రావడంతో.. ఆయన తన కల సాకారమైందని భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 25, 2024 8:08 pm

Jio

Follow us on

Jio : “జియో అనేది.. నా మానస పుత్రిక. ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదగాలి. టెలికాం సేవలను సామాన్య మానవులకు కూడా చేరువ కావాలి. అదే నా లక్ష్యం. దాని దిశగానే నా అడుగులు ఉంటాయి. ఆ అడుగులు భవిష్యత్తు నిర్మాణం వైపు పయనం సాగిస్తాయి” ఇవీ జియో నెట్ వర్క్ సేవల ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే.. ఆయన మానస పుత్రిక.. ఆయన స్థాపించిన జియో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది. భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి వాటిని దాటుకుని మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం నెట్ వర్క్ గా జియో ఆవిర్భవించింది.

మొబైల్ ట్రాఫిక్ విషయంలో..

జియో మొబైల్ ట్రాఫిక్ విషయంలో చైనా మొబైల్ కంపెనీని అధిగమించింది. 2024 ఫస్ట్ క్వార్టర్ లో చైనా మొబైల్ 38 ఎక్జా బైట్స్ మొబైల్ డేటా ట్రాఫిక్ నమోదు చేసింది. ఇదే సమయంలో 40.9 ఎగ్జా బైట్స్ తో జియో మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని గ్లోబల్ అనలటిక్స్ సంస్థ టిఫిసిఎంట్ ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, రిలయన్స్ జియో చరిత్రలో మరో అరుదైన ఘనత కూడా విష్కృతమైంది. 108 మిలియన్ సబ్ స్క్రైబర్లతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5 జీ సబ్ స్క్రైబర్ బేస్ కలిగివున్న రికార్డును సొంతం చేస్తుంది. ప్రస్తుతం రిలయన్స్ మొబైల్ డేటా ట్రాఫిక్ లో 28% 5 జీ సబ్ స్క్రైబర్లదే. జియో అనుసరిస్తున్న వ్యాపార వ్యూహం, ప్లాన్, ఇతర ఆఫర్ల వల్ల సబ్ స్క్రైబర్లు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఐపీఎల్ ప్రసార హక్కులను జియో మాతృ సంస్థ వయాకామ్ దక్కించుకుంది. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు చేసింది. జియో సినిమా ఓటీటీని విస్తరించుకునే క్రమంలో.. సబ్ స్క్రైబర్లు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించింది. దీంతో ప్రైమ్ టైం లో జియో సినిమా వ్యూయర్ షిప్ కోట్లల్లో నమోదవుతోంది. వచ్చే రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా విలీనం అవుతుంది కాబట్టి.. జియో సినిమా దేశంలోనే అతిపెద్ద ఓటీటీ గా అవతరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

తన మానస పుత్రిక లాంటి జియో ఈ స్థాయిలో విజయవంతం కావడంతో ముకేశ్ అంబానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన సంస్థ ప్రపంచ స్థాయిలోనే చైనా మొబైల్ కంపెనీతో పోటీపడి.. మొదటి స్థానంలోకి రావడంతో.. ఆయన తన కల సాకారమైందని భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో జియో ను మరింత బలోపేతం చేసి.. అతిపెద్ద నెట్వర్క్ గా విస్తరించాలని ముకేశ్ అంబానీ యోచిస్తున్నారని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.