Homeజాతీయ వార్తలుHydrogen Train India: భారత్‌లో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..

Hydrogen Train India: భారత్‌లో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..

భారతలో రైల్వే వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అతిపెద్ద రైల్వే వ్యవస్థ శతాబ్దాల క్రితమే భారత్‌లో ఏర్పడింది. బ్రిటిష్‌ పాలనలోనే రైలు మార్గాల నిర్మాణం జరిగింది. విస్తరణ, ఆధునికీకరణతో కొత్త పుంతలు తొక్కుతోంది.

Hydrogen Train India: మారుతున్న కాలానికి అనుగుణంగా భారత రైల్వే కూడా మార్పులు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు రైళ్లను, ట్రాక్‌ను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సెమీ స్పీడ్‌ రైళ్లను ప్రారంభించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించింది. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గింది. తాజాగా మరో అద్భుతమైన ప్రాజెక్టుకు భారత రైల్వే సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చివరి నాటికి తొలి హైడ్రోజన్‌ రైలును పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ రైలును హర్యానాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ వరకు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసింది. హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ ప్రోగ్రాంలో భాగంగా దశల వారీగా 35 హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో జర్మనీకి చెందిన టీయూవీ–ఎస్‌యూడీ సంస్థ రైతు భద్రతకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.

భారీగా ఖర్చు..
హైడ్రోజన్‌ రైలును పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వ భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కో యూనిట్‌కు రూ.10 కోట్లకుపైగా ఖర్చవుతుందని సమాచారం. ఒక్కో రైలుకు సుమారు రూ.80 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీని గ్రాండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సిస్టమ్‌ ఇంటిగ్రేటెడ్‌ యూనిట్‌ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. మొదటి రైలు నమూనాను హరాయనాలోని 89 కిలోమీటర్ల జింద్‌–సోనిపట్‌ మార్గంలో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోట్‌ ఫ్యాక్టరీలో ఇంటిగ్రేషన్‌ పనులు జరుగుతున్నాయి.

హైడ్రోజన్‌ రైలు నడుపుతున్న ఐదో దేశం:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాల్లో హైడ్రోజన్‌ రైళ్లు నడుస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్‌ రైళ్లు ఉండగా, భారత్‌ ఈ జాబితాలో ఐదో దేశంగా చేరనుంది. ఫ్రెంచ్‌ కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్‌ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి ఫ్రాన్స్‌లో ఈ హైడ్రోజన్‌ రైలు నడుస్తోంది. భారత్‌లో మాత్రం మొట్టమొదటి రైలు ఈ ఏడాది చివరకు పట్టాలెక్కనుంది. హర్యానాలో నడిచే ఈ రైళ్లకు జింద్‌లో ఉన్న 1 ఎండబ్ల్యూ పాలిమర్‌ ఎలక్ట్రోలైట్‌ మెమ్బ్రేన్‌ ఎలక్టోలైజర్‌ నుంచి హైడ్రోజన్‌ అందిస్తారు. అక్కడ రోజుకు దాదాపు 430 కిలోల హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. 3 వేల కిలోల హైడ్రోజన్‌ నిల్వ సామర్థ్యం కూడా ఉంది. సాధారణ రైలులో ఉండే ఇంజన్‌ స్థానంలో ఈ రైలులో హైక్ష6డోజన్‌ ఇంధన కణాలు ఉంటాయి. నీటితో నడిచే ఈ రైళ్లు కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ లేదా పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ వంటి కాలుష్య కారరాలను విడుదల చేయవు.

గంటకు 140 కి.మీల వేగం.
ఇక హైడ్రోజన్‌ రైలు నాలుగు కోచ్‌లు ఉంటాయి. నీలగిరి మౌంటైన్‌ రైల్వే, డార్జిలింగ్‌ హిమాలయన్‌ కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై, హర్వార్‌ దేవ్‌గర్‌ మదారియా మార్గాల్లో ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రైలు వేగం గంటకు 140 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. డీజిల్‌ ఇంజిన్‌తో పోలిస్తే హైడ్రోజన్‌ రైలును నడిపేందుకు ఎక్కువ ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో గ్రీన్‌ హైడ్రోజన్‌కు దాదాపు రూ.492 ఖర్చవుతుంది. డీజిల్‌ రైలుకన్నా 27 శాతం ఇంధన ఖర్చు ఎక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper