Yashaswi Jaiswal: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ స్థిరంగా ఆటను కొనసాగిస్తున్నాడు. ఇలా అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డుకు దగ్గరలో నిలిచాడు. మరికొన్ని పరుగులు చేస్తే 10 ఏళ్ల పాటు స్థిరంగా కొనసాగుతున్న రికార్డును బద్దలు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు జైస్వాల్.
టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్ లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో అదరగొడుతున్న ఈ యువ ప్లేయర్ కు బిసిసిఐ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసి అవకాశం కల్పించింది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే తన సత్తాను చాటాడు జైస్వాల్. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా భారీ ఇన్నింగ్స్ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 143 పరుగులు పూర్తి చేసిన జైస్వాల్.. మరో 45 పరుగులు పూర్తి చేస్తే భారత జట్టు తరుపున అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ (187) ఉన్నాడు. గత పదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. శిఖర్ ధావన్ తర్వాత 177 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మరో 57 పరుగులు చేస్తే భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు యశస్వి జైస్వాల్ కు అవకాశం ఉంది. 45 పరుగులు చేస్తే అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డు సృష్టించే అవకాశం లభిస్తుంది.
ఆ ఇద్దరినీ అధిగమించేసిన జైస్వాల్..
అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ పూర్తి చేయడం ద్వారా పలు రికార్డులను జైస్వాల్ అధిగమించాడు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువ క్రికెటర్ గిల్ ను జైస్వాల్ అధిగమించాడు. డెబ్యూ చేసే నాటికి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు విషయంలో వారిద్దరిని యశస్వి దాటేశాడు. సచిన్ 70.18 సగటు తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన తర్వాత టెస్టుల్లోకి వచ్చాడు. గిల్ 68.78 సగటుతో 23 మ్యాచ్లు ఆడిన తర్వాత అవకాశం దక్కించుకున్నాడు. కానీ, యశస్వి 15 మ్యాచ్ ల్లో 80.21 సగటుతో ఆడి టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. అయితే ఈ విభాగంలో మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లీ (27 మ్యాచ్ లు, 88.37), ప్రవీణ్ ఆమ్రే (23 మ్యాచ్ లు 81.23సగటు) అందరికంటే ముందున్నారు.