WTC Final 2023: ఓవల్ లో టీమిండియా గెలవగలదా? రికార్డులు ఏం చెబుతున్నాయి?

ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఇక్కడ భారత్ ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లన్ని ఇంగ్లాండ్ తో ఆడినవే. ఐదింటిలో ఇంగ్లాండు జట్టు విజయం సాధించగా, రెండు మ్యాచ్ ల్లో ఇండియా గెలుపొందింది.

Written By: BS, Updated On : June 5, 2023 4:01 pm

WTC Final 2023

Follow us on

WTC Final 2023: క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఓవల్ వేదికగా ఈ నెల 7 నుంచి 11వ తేదీల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓవల్ మైదానంలో ఇండియా గత రికార్డులు ఏం చెబుతున్నాయి. ఇక్కడ భారత జట్టు గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి వంటి అంశాలను చదివేయండి.

భారత జట్టు దశాబ్ధం నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. రెండేళ్ల కిందట జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై కప్ దక్కించుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది భారత జట్టు. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నీలకు ముందు అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు.. కీలకమైన టోర్నీల్లో మాత్రం చేతులెత్తేస్తోంది. భారత్ చివరిసారిగా ధోని కెప్టెన్సీలో 2013 జూన్ 23న ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకునేందుకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రూపంలో భారత్ కు మంచి అవకాశం దొరికింది. ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి గత రికార్డులు భారత జట్టుకు అనుకూలంగా ఉన్నాయా..? లేదా..? అన్న ప్రశ్నలు అభిమానులను తీవ్రంగా తొలిచేస్తున్నాయి.

ఈ మైదానంలో తొలిసారి తలపడుతున్న భారత – ఆస్ట్రేలియా..

ఓవల్ మైదానంలో భారత్ ఆస్ట్రేలియా జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఇక్కడ భారత్ ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లన్ని ఇంగ్లాండ్ తో ఆడినవే. ఐదింటిలో ఇంగ్లాండు జట్టు విజయం సాధించగా, రెండు మ్యాచ్ ల్లో ఇండియా గెలుపొందింది. మిగిలిన ఏడు మ్యాచులు డ్రా అయ్యాయి. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ 1936 ఆగస్టులో జరగా అందులో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2021 సెప్టెంబర్ లో జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ 157 పరుగులు తేడాతో విక్టరీ సాధించింది. ఈ మైదానంలో ఆసీస్ జట్టుకు కూడా మంచి రికార్డు లేదు. ఇప్పటి వరకు ఓవల్ లో కంగారూలు 38 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా, ఏడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించారు. 17 టెస్టుల్లో ఓడిపోగా 14 మ్యాచ్లను డ్రా చేసుకున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో రెండుసార్లు (2001, 2015) మాత్రమే గెలుపొందింది. ఈ మైదానంలో భారత్ ఆడిన చివరి 5 మ్యాచ్లను పరిశీలిస్తే..

ఆ మ్యాచ్ లో బ్యాటర్ అవతారం ఎత్తిన అనిల్ కుంబ్లే..

అనిల్ కుంబ్లే అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది స్పిన్ మాయాజాలం. 2007 ఆగస్టులో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కుంబ్లే బ్యాటర్ అవతారం ఎత్తాడు ఈ స్పిన్నర్. 193 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్స్ బాదేసి అనూహ్యంగా సెంచరీ సాధించాడు. అతడి కెరీర్ లో ఇదే ఏకైక సెంచరీ కావడం విశేషం. అనిల్ కుంబ్లే శతకానికి తోడు దినేష్ కార్తీక్ (91), ధోని (92), సచిన్ (82), రాహుల్ ద్రావిడ్ (55) పరుగులతో రాణించడంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 664 పరుగులకు ఆల్ అవుట్ అయింది. జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే మూడేసి వికెట్లతో మెరవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 345 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 186 వద్ద డిక్లేర్ చేయగా 500 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల నష్టానికి 369 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనిల్ కుంబ్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇయాన్ బెల్ డబుల్ తో ఇండియా ట్రబుల్..

ఓవల్ మైదానం వేదికగా 2011 ఆగస్టులో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ఎనిమిది పరుగులు తేడాతో ఘోర ఓటమిపాలైంది. ఇయాన్ బెల్ (235) డబుల్ సెంచరీకి తోడు కెవిన్ పీటర్సన్ (175) శతకం కొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 591/6 వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 300 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. రాహుల్ ద్రావిడ్ (146), అమిత్ మిశ్రా (43) మినహా మిగతా అందరూ చేతులెత్తేయడంతో భారత్ తో ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ లోను భారత్ జట్టు ఆట తీరు మారలేదు. ఈసారి 283 పరుగులకే కుప్ప కూలింది. సచిన్ (91), అమిత్ మిశ్రా (84) మాత్రమే రాణించడంతో భారత్ కు ఘోర ఓటమి తప్పలేదు.

150 లోపు రెండుసార్లు ఆల్ అవుట్ అయిన భారత్..

2014 ఆగస్టులోనూ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఏకంగా ఇన్నింగ్స్ 244 పరుగులు తేడాతో ఓటమి పాలయింది. భారత్ రెండుసార్లు 150 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (3/30), జోర్డాన్ (3/32), అండర్సన్ (2/51), స్టువర్ట్ బ్రాడ్ (2/27) చెలరేగడంతో భారత్ 148 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. కెప్టెన్ ధోని (82) పోరాడకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ (149), అలిస్టర్ కుక్ (79) రాణించడంతో ఇంగ్లాండు 486 పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ పేసర్ల ధాటికి భారత్ 194 పరుగులకే చేతులెత్తేసింది.

పంత్, రాహుల్ పోరాడినా తప్పని ఓటమి..

2018 సెప్టెంబరులో ఓవల్ మైదానంలో మ్యాచ్ జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు 118 పరుగులు తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 332 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం జడేజా (86), హనుమ విహారి (56), కోహ్లీ (49) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 292 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అలిస్టర్ కుక్ (147) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లాండు 423/8 వద్ద డిక్లేర్ చేసింది. 464 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 345 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) శతకాలతో మెరిసిన భారత్ ను విజయతీరాలకు చేర్చలేకపోయారు.

రోహిత్ శర్మ చెలరేగడంతో దక్కిన విజయం..

ఓవల్ మైదానంలో వరసగా మూడు ఓటములు ఎదుర్కొన్న టీమ్ ఇండియా 2021 లో జరిగిన మ్యాచ్ తో గెలుపు బాట పట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆల్ అవుట్ అయిన భారత్ రోహిత్ శర్మ (127) శతకానికి తోడు కేఎల్ రాహుల్ (46), పూజారా (61), కోహ్లీ (44) కూడా రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 99 పరుగులు ఆధిక్యత సంపాదించిన ఇంగ్లాండ్ ఉమేష్ యాదవ్ (3/60), బుమ్రా (2/27), జడేజా (2/50), శార్దూల్ ఠాకూర్ (2/22) బంతితో మెరవడంతో రెండో ఇన్నింగ్స్ లో 210 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 157 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత ఆటగాళ్లు ఈ మైదానంలో ఎలా ఆడతారు అన్న ఆసక్తి నెలకొంది. చివరిసారిగా ఆడిన టెస్టు మ్యాచ్ లో విజయం లభించడంతో భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.