Vaibhav Surya Vamsi: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. గౌహతి మైదానంలో విధ్వంసం సృష్టించాడు 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో అర్థ శతకం పూర్తి చేసుకున్న తర్వాత.. వైభవ్ సూర్య వంశీ గురించి ప్రధాన మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది.
వైభవ్ సూర్య వంశీ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసిన తర్వాత రాజస్థాన్ జట్టు విజయం నల్లేరు మీద నడకలాగా మారిపోయింది. చెన్నై బౌలర్లను వైభవ్ ఒక ఆట ఆడుకున్నాడు. గౌహతి మైదానంలో పరుగులు పెట్టించాడు. బంతిని నలుమూలల వెళ్లే విధంగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే కేవలం 12.1 ఓవర్లలోనే చెన్నై విధించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఫినిష్ చేయగలిగింది. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వైభవ్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి ఆశ్చర్యాన్ని.. విస్మయాన్ని కలిగిస్తున్నాయి..
వైభవ్ ఏమన్నాడంటే
” నేను డిఫెన్స్ ఆడాలి అనుకున్నాను. ఆ తర్వాత జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడి నిద్రపోవాలి అనుకున్నాను. నా పుట్టినరోజు నాడు కేక్ కటింగ్ చేయాల్సి ఉండేది. అది నా ముఖానికి అంటుకోకుండా ఉండడానికి త్వరగా నిద్రపోయాను. చెన్నైతో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లే లో బాగా ఆడాలి అనుకున్నాను. మొదట్లో వికెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బంతి పాతగా అయ్యే కొద్ది అది బ్యాట్ మీదకి రావడం మొదలైంది. దీంతో పవర్ ప్లేలో మేము అనుకున్న లక్ష్యం పూర్తయింది. చెన్నై బౌలర్లు మా కోచ్ లు నా మీద దాడి చేస్తారని అధికంగా నాకు చెప్పలేదు. మిగతావారు మాత్రం ఆ విషయం చెబుతూనే ఉన్నారు. నా సహజమైన ఆటను మార్చుకోవద్దని.. సూచించారు. నా పార్ట్నర్ జైస్వాల్ ప్రతి బంతి పడిన తర్వాత నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు సింగిల్స్ తీసుకోవాలి చెబుతూనే ఉన్నాడు. నాకు స్ట్రైక్ ఇస్తున్నాడు. బంతి బ్యాట్ మీదకి వస్తే గట్టిగా కొట్టమని చెబుతున్నాడు. అదే సిద్ధాంతాన్ని నేను పాటించాను. జట్టుకు వేగవంతమైన భాగస్వామ్యం అందించాను” అని వైభవ్ వ్యాఖ్యానించాడు.
వైభవ్ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు కలిగిస్తున్నాయి..” అతడిలో అమాయకత్వం ఉంది. అతడు మాట్లాడే మాటలు ఆ విషయాన్ని చెబుతున్నాయి. అతడు ఎలా ఆడాలి అనుకున్నాడో.. అదేవిధంగా బ్యాటింగ్ చేశాడు. అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇందులో డ్రామా లేదు. సినిమా అంతకన్నా లేదు.. ఏదైనా బుడ్డోడు చాలా గట్టివాడు అని” నెటిజన్లు పేర్కొంటున్నారు.