Vaibhav Surya Vamshi: ఒక ఆటగాడిలో అన్ని కళలు ఉండాలి. ఆడినా ఆడకపోయినా ప్రేక్షకుల అటెన్షన్ తన మీద ఉండాలి. అప్పుడే ఆటగాడు జనాల నోళ్ళల్లో నానుతూ ఉంటాడు. మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండడంవల్ల తన రేంజ్ మరింత పెంచుకుంటాడు. ఇది తెలుసు కాబట్టి విరాట్ కోహ్లీ మీడియాలో సెన్సేషన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కెరియర్ తొలి రోజుల్లో విరాట్ కోహ్లీ చేసిన ప్రయోగాలు.. మైదానంలో చేసిన పనులు ఏ ఆటగాడు చేయలేదంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ కూడా విరాట్ కోహ్లీ మాదిరిగానే ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ఐపిఎల్ లో పరుగుల వరద పారిస్తున్నాడు సూర్య వంశీ. 15 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తే అతడికి 15 సంవత్సరాలు అంటే నమ్మబుద్ధి కావడం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అతడు ఆడుతున్న తీరు గొప్పగా ఉందని.. సీనియర్ బ్యాటర్ కూడా అతని స్థాయిలో బ్యాటింగ్ చేయలేడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వైభవ్ భవిష్యత్తు కాలంలో అద్భుతమైన ఆటగాడు అవుతాడని చెబుతున్నారు.
సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ విఫలమయ్యాడు. 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన రాజస్థాన్ అభిమానులకు నిరాశ మిగిల్చాడు. దీంతో హైదరాబాద్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ బ్యాట్ తో శివతాండవం చేశాడు. హైదరాబాద్ జట్టు పై కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని అందరు ఊహించారు. కానీ అతడు దురదృష్టవశాత్తు 0 పరుగులకే అవుట్ అయ్యాడు.
హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ సరికొత్త అవతారంలో కనిపించాడు. బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. ఆటగాళ్ల కోసం డ్రింక్స్ మోస్తూ కనిపించాడు.. తల పైన ఆరెంజ్ క్యాప్ ధరించి.. మెడ మీద టవల్ వేసుకుని సరికొత్త అవతారంలో అతడు దర్శనమిచ్చాడు. దీంతో రాజస్థాన్ అభిమానులు అతడిని చూసి కేరింతలు కొట్టారు. హైదరాబాద్ అభిమానులు కూడా అతడిని ఎంకరేజ్ చేశారు. బెంగళూరు మీద పరుగుల ప్రవాహం సాగించిన సూర్యవంశీ.. ఇప్పుడు తల మీద ఆరెంజ్ క్యాప్ ధరించి డ్రింక్స్ మస్తున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. డ్రింక్స్ మోస్తూ సూర్యవంశీ నవ్వుతూ కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి.
