Homeక్రీడలుT20 World Cup Champions: రోహిత్-ద్రావిడ్ వరల్డ్ కప్ చేతిలో పెట్టి.. ప్రధానికి ఏం గిఫ్ట్...

T20 World Cup Champions: రోహిత్-ద్రావిడ్ వరల్డ్ కప్ చేతిలో పెట్టి.. ప్రధానికి ఏం గిఫ్ట్ ఇచ్చారు? మోదీ ఏం మాట్లాడారో తెలుసా?

T20 World Cup Champions: ” మీ విజయాన్ని చూస్తే ముచ్చటేస్తోంది. ఈ విజయాల పరంపరను ఇలానే కొనసాగించండి. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. మీ అందరి వెంట భారతజాతి యావత్తు మొత్తం ఉంది. విజయాలు సాధించినప్పుడు దేశంలో సరికొత్త సానుకూల శక్తి ఉద్భవిస్తుంది. అది మరింత ఎదగాలంటే.. మరింత మందిని ప్రోత్సహించాలంటే.. ఈ విజయాలు కలకాలం కొనసాగాలని” భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ గురువారం ఆయన చేతిలో కప్ పెట్టిన తర్వాత నరేంద్ర మోదీ పై వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఉదయం 6 గంటలకు బార్బడోస్ ప్రాంతం నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకుంది. భారత క్రికెటర్లు న్యూఢిల్లీలో విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే అభిమానులు జయ జయ ధ్వానాలు పలికారు.. టీమిండియా ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేశారు.. గొప్ప విజయం సాధించారంటూ కితాబిచ్చారు.. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ విజయాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన కేక్ కట్ చేశారు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ ను అభిమానులకు రోహిత్ శర్మ ప్రత్యేకంగా చూపించారు.. విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటిసి మౌర్య హోటల్ కు టీమిండియా క్రికెటర్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ లోకి ప్రవేశించే మార్గంలో వివిధ కళాకారులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు వేశారు. అనంతరం ఆ హోటల్లో టీమిండి ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో క్రికెటర్లు కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ ” నమో” అనే అక్షరాలతో రూపొందించిన జెర్సీని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు..

ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశం గర్వించే విజయాన్ని సాధించారంటూ ఆటగాళ్లకు కితాబిచ్చారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా, అతడి సతీమణి సంజనా గణేషన్, ఇతర ఆటగాళ్లు నరేంద్ర మోదీని కలిసిన వారిలో ఉన్నారు.. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ప్రధాని ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.. ఈ ఫోటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ప్రధానితో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ముంబై బయలుదేరి వెళ్లిపోయారు. ముంబైలో గురువారం సాయంత్రం రోడ్ షో తర్వాత.. ఆటగాళ్లను బీసీసీఐ సన్మానిస్తుంది. అనంతరం 125 కోట్ల విలువైన చెక్కు అందిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular