SRH Vs BCCI Complaint IPL Controversy: హైదరాబాద్ జట్టు ప్రస్తుత ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ గెలిచి ఉండాల్సిందే.. అంతకుముందు ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు జట్టుపై సమర్థవంతంగా బౌలింగ్ వేసి ఉంటే.. ఆ మ్యాచ్లో కూడా సానుకూల ఫలితం వచ్చేది.. మొదటి, మూడవ మ్యాచ్ లో ఓటములు ఎదురు కావడంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ జట్టు రెండు ఓటములను ఎదుర్కోడాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోంది. దీని వెనుక జరిగిన కుట్రలను బీసీసీఐ దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో హైదరాబాద్ ప్లేయర్ల క్యాచ్ లను సరిగ్గా పట్టలేదని సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో క్లాసెన్ క్యాచ్ ను సాల్ట్, అభిషేక్ శర్మ క్యాచ్ ను కోల్ కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి బంతులను నేలను తాకిన తర్వాత పట్టుకున్నట్టు కనిపించింది. అయినప్పటికీ అంపైర్లు ఔట్ ఇచ్చారు. దీనిపట్ల హైదరాబాద్ యాజమాన్యం తీవ్రమైన ఆగ్రహం గా ఉంది.
ఆదివారం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో లక్నో ఆటగాడు కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే ఆవేష్ ఖాన్ బ్యాట్ తో లోపలికి వచ్చాడు. ఈ వ్యవహారాలు మొత్తం హైదరాబాద్ జట్టుకు వ్యతిరేకంగా ఉన్నాయని.. సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ ఘటనల వల్ల గెలవాల్సిన మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు ఓడిపోయిందని సన్ రైజర్స్ యాజమాన్యం చెబుతోంది..
“ఆ ఘటనలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మా జట్టు గెలిచి ఉండాల్సిన తరుణంలో.. ఇవన్నీ కూడా వ్యతిరేకంగా జరిగాయి. వాటి వల్ల మేము తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. గెలిచే దశలో ఈ ఘటనలు మమ్మల్ని ఒత్తిడికి గురిచేసాయి. ఇచ్చిన తీర్పులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్లే ఈ విషయాలను బిసిసిఐ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామని” సన్ రైజర్స్ యాజమాన్యం చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా క్లారిటీ ఇస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.