Smriti Mandhana emotional story: భారత మహిళా క్రికెట్ జట్టులో విమెన్ విరాట్ కోహ్లీ మాదిరిగా పేరు తెచ్చుకుంది స్మృతి మందాన. ఆమె ఫార్మాట్ తో సంబంధం లేకుండానే పరుగులు తీస్తూ ఉంటుంది. ఓపెనర్ గా బరిలోకి దిగే ఆమె.. శివంగి మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె నిలబడితే చాలు టీమిండియా భారీ స్కోర్ చేసినట్టే.. తోటి ప్లేయర్లకు కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసి ఆమెకు ఇచ్చేస్తే సరిపోతుంది.
స్మృతి మందాన అనేక కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చింది. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు గురైనప్పటికీ.. రకరకాల విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా రాకెట్ వేగంతో దూసుకు వచ్చింది. ఇప్పుడు టీం ఇండియాలో అసలు సిసలైన ప్లేయర్ గా ఆమె నిలబడింది. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు ఆశా కిరణం లాగా కనిపిస్తోంది.
స్మృతి మందాన కొన్ని సందర్భాలలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న విషయాలను వెల్లడించింది. అయితే క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఇబ్బందులను ఇటీవల చెప్పిన తీరు కంటనీరు తెప్పిస్తోంది.. కొన్ని సందర్భాలలో దేశం కోసం ఆడుతున్నప్పుడు రకరకాల నొప్పులను అనుభవించాల్సి ఉంటుందని ఆమె చెప్పిన తీరు గుండెను ద్రవింపజేస్తోంది.
అప్పట్లో స్మృతి ఒక మ్యాచ్ ఆడుతోంది. ఆమె వైట్ జెర్సీ ధరించి ఉంది. అకస్మాత్తుగా ఆమెకు నెలసరి వచ్చింది. భరించలేని నొప్పి ఆమెను ఇబ్బంది పడుతోంది. అప్పటికి తట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఇక ఆమె వల్ల కావడం లేదు. దీంతో ఆమె పరిస్థితిని మైదానంలో ఉన్న అంపైర్ అర్థం చేసుకున్నారు. వెంటనే ఆమె మైదానం నుంచి బయటికి పరుగులు పెట్టింది. తనకు కావలసిన రక్షణ చర్యలను తీసుకుంది. కొన్ని సందర్భాలలో దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆ నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది అని చెప్పడం స్మృతి వ్యక్తిత్వానికి నిదర్శనం గా నిలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఐసీసీ నిబంధనలలో మహిళా ప్లేయర్లకు నెలసరి విషయంలో ఎటువంటి రూల్ లేకపోవడం గమనార్హం. ఇకపై నైనా ఐసీసీ ఆ రూల్ సవరిస్తుందో చూడాల్సి ఉంది.
సాధారణంగా ఆ సమయంలో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కొందరికి ఆరోగ్యరీత్యా సమస్య అధికంగా ఉంటుంది. భరించలేని నొప్పి కూడా ఉంటుంది. అలాంటప్పుడు వారు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దేశం కోసం ఆడుతున్నప్పుడు మహిళా క్రీడాకారులకు అటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వారు ఇబ్బంది పడుతూనే మ్యాచ్ సాగించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ మహిళా క్రీడాకారులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని.. వెసలు బాటు ఇవ్వాలని మాజీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ టి20 వరల్డ్ కప్ లోనైనా ఐసీసీ ఆ నిబంధన తీసుకొస్తుందో చూడాల్సి ఉంది.
