Rishabh pant , Sanjeev goyanka
Rishabh pant and Sanjeev goyanka : ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ లీగ్. 2009లో 17వేల కోట్లకు ఐపీఎల్ విలువ ఉంటే.. ఇప్పుడు లక్ష కోట్లను దాటింది. ఇలాంటి చోట ఆటగాళ్లకు స్వేచ్ఛ ఎలా ఉంటుంది.. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించడానికి ఆస్కారం ఎక్కడ లభిస్తుంది.. పెట్టుబడి పెట్టిన కంపెనీలు లాభాలను ఆశిస్తాయి. తాము ప్రమోట్ చేసే జట్లు గొప్పగా ఆడాలని భావిస్తాయి. వారికి క్రికెట్ నేపథ్యం ఉందా? క్రికెట్ ఆటను వారు ఆస్వాదించగలరా? ఓడిపోయినప్పుడు జట్టును భుజం తట్టి ప్రోత్సహించగలరా? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. ఎందుకంటే “గొంగడి కింద కూర్చొని.. గొర్రె బొచ్చు పడింది” అంటే ఎవరూ దానిని స్వాగతించరు.. స్థూలంగా చెప్పాలంటే డబ్బులు పెట్టినవాడు అడుగుతాడు. ఓడిపోతే మందలిస్తాడు.. ఇంకోసారి ఓడిపోతే బాగుండదు అని హెచ్చరిస్తాడు. డబ్బులు తీసుకున్న ఆటగాడు ఆ మాటలను పడాలి. ఇబ్బంది అనుకున్నా పర్వాలేదు భరించాలి. ఒకవేళ ఇదంతా ఎందుకు అనుకుంటే.. ఆత్మాభిమానం మెండుగా ఉందని భావిస్తే నోరు మూసుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించాలి.
Also Read : 27 కోట్లు పెట్టి కొంటే.. 17 పరుగులా..
అందులో తప్పేముంది
లక్నో జట్టు యజమాని మిగతా తొమ్మిది జట్ల యజమానుల కంటే భిన్నం. ఉదాహరణకు హైదరాబాద్ జట్టు ఓడిపోతే కావ్య మారన్ ఏడుస్తుంది. చెన్నై జట్టు ఓడిపోతే శ్రీనివాసన్ లైట్ తీసుకుంటాడు.. ముంబై జట్టు ఓడిపోతే కెప్టెన్ మారతాడు… ఇక మిగతా జట్ల యాజమాన్యాలు కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించవు. కానీ లక్నో జట్టు యజమాని తీరు వేరు. ఆయనకు క్రికెట్ తో సంబంధం లేదు. ఎలా ఆడతారు అనేది అవసరం లేదు. తన జట్టు మాత్రం గెలవాలి.. ఐపీఎల్ ట్రోఫీ సాధించాలి. జట్టు విలువ పెరగాలి. అండర్స్మెంట్ ల ద్వారా వందల కోట్లు రావాలి. పది రూపాయలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయల లాభం అతడు కళ్ళ చూడాలి. దీనికోసం ఆటగాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటారా .. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో తీవ్ర స్థాయిలో పోటీ పడతారా.. అనేవి సంజీవ్ గొయేంకా(Sanjeev goyanka) కు అనవసరం.. మంగళవారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ను ఉద్దేశించి వేలు చూపించుకుంటూ సంజీవ్ గొయేంకా(Sanjeev goyanka) విమర్శలు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని చాలామంది క్రికెట్ విశ్లేషకులు.. మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. కానీ ఇక్కడే వారు అసలు విషయం మర్చిపోతున్నారు. పెట్టుబడి పెట్టినవాడు ఎందుకు ఊరుకుంటాడు.. 27 కోట్లు పెట్టి ఆటగాడిని కొనుగోలు చేసినవాడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడు.
సంజీవ్ గొయేంకా(Sanjeev goyanka) స్థానంలో ఇంకొకరు ఉన్నా అలానే చేసేవారు. అలానే చేస్తారు కూడా.. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికనే రావు.. చివరికి రిషబ్ పంత్ కూడా లక్నో జట్టుకు ఊరికే ఆడటం లేదు. డబ్బులు తీసుకుని ఆడుతున్న నేపథ్యంలో ఆ మాత్రం దూకుడు చూపించకపోతే ఎవరు ఊరుకుంటారు. మరీ దారుణంగా తొలి మ్యాచ్లో సున్నా.. రెండో మ్యాచ్లో 15.. మూడో మ్యాచ్లో రెండు పరుగులు చేస్తే ఏ జట్టు యజమానికైనా కాలుతుంది కదా..సంజీవ్ గొయేంకా(Sanjeev goyanka) కు కాలడంలో తప్పులేదు కదా.. ముందే అనుకున్నాం కదా ఇక్కడ క్రికెట్ స్ఫూర్తి లేదు… జస్ట్ డబ్బు.. డబ్బు మాత్రమే..
Also Read : రిషబ్ పంత్ మీద పట్టరాని కోపంతో టీవీ పగలగొట్టాడు.. వీడియో వైరల్