Rajasthan Royals Vs Punjab Kings: ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ జట్టుకు ఓటమి అనేది లేదు. బలమైన జట్లను ఓడించిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఎదురు అనేది లేకుండా సాగిపోతున్న ఆ జట్టుకు తొలిసారి ఓటమిని రుచి చూపించింది రాజస్థాన్ జట్టు.
పరుగుల ప్రవాహం సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు చేజింగ్లో సరికొత్త రికార్డు సృష్టించింది..ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు జైస్వాల్, సూర్య వంశీ, జూరెల్ మీద ఆధారపడిన రాజస్థాన్ బ్యాటింగ్.. తొలిసారి మిడిల్ ఆర్డర్ సత్తా వల్ల విజయం సాధించింది. దీంతో మిడిల్ ఆర్డర్ కూడా రాజస్థాన్ జట్టుకు అత్యంత బలమైన బృందంగా ఉందని నిరూపితమైంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.. ఓపెనర్ సిమ్రాన్ సింగ్ (59) మరోసారి అదరగొట్టాడు. కూపర్ కానోలి (30), అయ్యర్ (30), స్టోయినిస్(62*) పరుగులు చేయడంతో పంజాబ్ 222 పరుగులు చేసింది..
223 లక్ష్యంతో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ప్రారంభం నుంచి దాటిగా ఆడింది. ఓపెనర్లు జైస్వాల్ (51), వైభవ్ (43) సత్తా చూపించారు. వీరిద్దరి దూకుడు వల్ల రాజస్థాన్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. జూరెల్ (16), పరాగ్ (29) అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. డోనోవన్ ఫెరీర (52*), శుభం దుబే(31*) అదరగొట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. ఫలితంగా రాజస్థాన్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
ఒక దశలో 151 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్ జట్టు. దీంతో పంజాబ్ విజయం సాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో ఫెరీరా అదరగొట్టాడు.. పంజాబ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 26 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుభం దుబే కూడా 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి సత్తా చూపించాడు. దీంతో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వీరిద్దరిని పంజాబ్ జట్టు ప్లేయర్లు తక్కువ అంచనా వేశారు. చివరికి మూల్యం చెల్లించుకున్నారు.
