Sunrisers Hyderabad Vs Rajasthan Royals: హైదరాబాద్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ ఎదుట 218 పరుగుల టార్గెట్ విధించింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్య వంశీ ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాలని.. లయ కోల్పోతే ఇబ్బందులు తప్పవని.. కామెంట్రీ బాక్స్ లో ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇంతలోనే స్టేడియంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దానికి ప్రధాన కారణం హైదరాబాద్ బౌలర్ ప్రపుల్ హింజ్.
ప్రస్తుత ఐపిఎల్ లో బీభత్సంగా ఆడుతున్న ఆటగాడు వైభవ్ సూర్య వంశీ. 15 సంవత్సరాల ప్రాయంలో అతడు నెలకొల్పుతున్న రికార్డులు దిగ్గజ ఆటగాళ్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా అతడు అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని.. విధ్వంసానికి పరాకాష్టగా ఇన్నింగ్స్ నిర్మిస్తాడని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఎలాగైనా సరే అవుట్ చేయాలని.. గొప్ప అవకాశం ఇవ్వకుండా చూడాలని విశ్లేషకులు హైదరాబాద్ బౌలర్లకు సూచించారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ బౌలర్లలో ముఖ్యంగా ప్రపుల్ హింజ్ బౌలింగ్ వేశాడు.
ప్రపుల్ బౌలింగ్ లో సూర్యవంశీ (0) గోల్డెన్ డక్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే సలీల్ అరోరా పట్టిన క్యాచ్ కు ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.
సూర్య వంశి అవుట్ అయిన తర్వాత జురెల్ మైదానంలోకి వచ్చాడు.. ఇతడు ప్రపుల్ వేసిన తొలి బంతిని డిఫెన్స్ ఆడాడు. ఆ తర్వాత మరుసటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో రెట్టింపు సంతోషం.. హైదరాబాద్ ఆటగాళ్లలో ఎగిరి గంతేసే ఆనందం.. అప్పటికే సూర్యవంశీ అవుట్ కావడంతో హైదరాబాద్ అభిమానులు యుపోరియాలో ఉన్నారు. జూరెల్ క్లీన్ బౌల్డ్ కావడంతో.. ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకున్నారు.
ప్రపుల్ తన ఓవర్ చివరి బంతికి హైదరాబాద్ అభిమానులకు మరింత ఆనందాన్ని అందించాడు. ఎందుకంటే ఆ బంతికి ప్రమాదకరమైన ప్రిటోరియస్ క్యాచ్ అవుట్ అయ్యాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి అత్యంత దారుణమైన కష్టాల్లో పడింది.
ప్రపుల్ కు డెబ్యూ మ్యాచ్ ఇది. ప్రారంభ మ్యాచ్లోనే అతడు అదరగొట్టాడు. ఓకే ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. తద్వారా రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. విదర్భ జట్టుకు ఆడుతున్న ఇతడు.. తిరుగులేని స్థాయిలో బౌలింగ్ వేస్తున్నాడు. ఇన్ని రోజులపాటు బౌలింగ్ లోపంతో బాధపడిన హైదరాబాద్ జట్టుకు.. ఒక ఆపద్బాంధవుడిగా నిలిచాడు. అందువల్లే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది.
మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్థాన్ జట్టుకు.. ప్రపుల్.. కెప్టెన్ పరాగ్ ను కూడా అతడు అవుట్ చేశాడు. మరోవైపు అత్యంత ప్రమాదకరమైన జైస్వాల్ ను హుస్సేన్ వెనక్కి పంపించాడు. ఫలితంగా ఈ కథనం రాసే సమయం వరకు రాజస్థాన్ జట్టు 15 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
