https://oktelugu.com/

Kane Williamson: కేన్ మామ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు గల్లంతు..

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ (Kane Williamson) ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. అంతర్జాతీయ వన్డేలలో అత్యంత వేగంగా 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సృష్టించిన రెండవ ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇదే క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును గల్లంతు చేసాడు.

Written By: , Updated On : February 11, 2025 / 12:42 PM IST
Kane Williamson

Kane Williamson

Follow us on

Kane Williamson: ట్రై వన్డే సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తెలపడ్డాయి. ఈ మ్యాచ్లో కేన్ విలియంసన్ సెంచరీ చేసి.. ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.. 159 ఇన్నింగ్స్ లలో 7 వేల పరుగుల మైలురాయిని విలియంసన్ అందుకోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఆషీమ్ ఆమ్లా 151 ఇన్నింగ్స్ లలో 7,000 రన్స్ మైల్ స్టోన్ అందుకొని టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఎబి డివిలియర్స్ 161 ఇన్నింగ్స్ లు, సౌరవ్ గంగూలీ 174 ఇన్నింగ్స్ లు, రోహిత్ శర్మ 181 ఇన్నింగ్స్ లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెన్ విలియంసన్ న్యూజిలాండ్ తరఫున వన్డేలలో 7000 పరుగుల మైలురాయి అందుకున్న ఐదవ ఆటగాడిగా నిలిచాడు. రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మార్టిన్ గఫ్టిల్, నాథన్ ఆస్ట్ లే వన్డేలలో 7000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఐదు సంవత్సరాల అనంతరం విలియంసన్ సెంచరీ కొట్టాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు.. 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో న్యూజిలాండ్ జట్టుకు ఈ గెలుపును అందించాడు. ఈ గెలుపు ద్వారా న్యూజిలాండ్ జట్టు ట్రై సిరీస్లో ఫైనల్ వెళ్లిపోయింది.

సౌత్ ఆఫ్రికా 304

ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లను పూర్తిస్థాయిలో ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఎంట్రీ ప్లేయర్ మాథ్యూ బ్రీ ట్జ్ కే(148 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 150) విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. వియాన్ మల్డర్(60 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 64) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఎంట్రీ ఇచ్చిన వన్డే లోనే 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా బ్రీ ట్జ్ కే రికార్డు సృష్టించాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూ ర్కే చెరి రెండు వికెట్లు పడగొట్టారు. మైకేల్ బ్రేస్ వెల్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్ జట్టు 48.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కెన్ విలియంసన్ అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు.. కాన్వే(97) మూడుపరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ముతు స్వామి రెండు వికెట్లు సాధించాడు. జూనియర్ డాలా, ఎథన్ బోస్చ్ చెరో టికెట్ సాధించారు.. బుధవారం జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు సౌత్ఆఫ్రికా తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్ వెళ్తుంది. న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ను ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.