Team India match hero performance: టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో విజయమందుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి.. చివరికి గెలుపును దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన నేపథ్యంలో టీమిండియా ఆదివారం ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ జట్టుతో ఫైనల్ మ్యాచ్లో ఆడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సంజు చెలరేగి ఆడాడు. అతడి దూకుడు వల్ల టీమిండియా ఏకంగా 253 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 254 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడింది. ఏడు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
టీమిండియా విజయంలో సంజు, బుమ్రా కీలకపాత్ర పోషించారు. సంజు బ్యాట్ ద్వారా.. బుమ్రా బంతి ద్వారా అదరగొట్టారు. అయితే వీరిద్దరి కంటే కూడా హార్దిక్ పాండ్యా జట్టు విజయంలో అద్భుతమైన పాత్ర పోషించాడు. ఎందుకంటే 19 ఓవర్ వరకు ఇంగ్లాండు జట్టు స్కోరు 224/6 వద్ద ఉంది. కరణ్ ఔట్ అయినప్పటికీ.. బెతల్ రంగంలో ఉన్నాడు. అప్పటికే అతడు 47 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చివరి ఓవర్లో ఇంగ్లాండు విజయానికి 23 పరుగులు అవసరం. అయితే బెతల్ ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ జట్టు విజయం మీద ఆశావాహ దృక్పథంతో ఉంది. చివరి ఓవర్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ శివం దుబే కు ఇవ్వడంతో అందరిలోనూ అనుమానాలు కలిగాయి. ఎందుకంటే అతడు జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో పరుగులు ఇస్తాడని అందరు భయపడ్డారు.
దూబే వేసిన బంతిని బెతల్ భారీ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతిని హార్దిక్ పాండ్యా తెలివిగా ఆపాడు.. మొదటి పరుగు సులభంగా తీసిన బెతల్, ఓవర్టన్.. రెండో పరుగు విషయంలో ఇబ్బంది పడ్డారు. బెతల్ వికెట్ లక్ష్యంగా హార్దిక్ పాండ్యా బంతిని విసిరేయడంతో.. కీపర్ సంజు అద్భుతంగా పట్టుకున్నాడు. రెప్పపాటు వేగంలో వికెట్లను గిరాటేశాడు. దీంతో బెతల్ రన్ అవుట్ అయ్యాడు.
బెతల్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ మొత్తం టీమిండియా వైపు టర్న్ అయింది. ఓవర్టన్, ఆర్చర్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ.. అప్పటికే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. అయితే శివం దుబే వేసిన చివరి మూడు బంతులను ఆర్చర్ సిక్సర్లుగా కొట్టడం విశేషం. అతడు వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో గెలుపు అంతరం మాత్రమే తగ్గింది. అంతిమంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది.