Neeraj Chopra: మరోసారి బంగారు కొండగా అవతరిస్తాడు అనుకుంటే.. వెండిదండతో ముగించాడు

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా తనకు తానే ప్రధాన పోటీ అనుకున్నాడు. నేటి ఆటగాళ్లను మించి 89.45 మీటర్ల దూరం బల్లెం విసిరి.. ఔరా అనిపించాడు. అయితే ఇదే దశలో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయాడు. దీంతో మీరజ్ రజితంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 9, 2024 9:09 am
Follow us on

Neeraj Chopra: మెడల్ సాధిస్తుందనుకున్న పీవీ సింధు విఫలమైంది. గోల్డ్ మెడల్ వస్తుందనుకున్న రెజ్లింగ్ లో వినేశ్ ఫొగాట్ బరువు వల్ల వెనుదిరిగింది. హాకీలో గోల్డ్ మెడల్ వస్తుందని అంచనా వేసుకుంటే బెల్జియం అడ్డుపడింది. చివరికి స్పెయిన్ పై గెలుపు దక్కి.. కంచు సాధ్యమైంది. ఇలా ఆశలన్నీ అడుగంటుతున్న నేపథ్యంలో.. బంగారు తునకలాగా నీరజ్ చోప్రా కనిపించాడు. ఎందుకంటే గత ఒలింపిక్స్ లో అతడు బంగారు కొండయ్యాడు. ఈసారి కూడా చరిత్రను మరోసారి పునరావృతం చేస్తాడని.. బంగారు ఈటెను సంధించి అద్భుతం చేస్తాడని అందరూ అనుకున్నారు. అందరి అంచనాల తగ్గట్టుగానే ఉత్తమ ప్రదర్శన చేశాడు. రెండుసార్లు ప్రపంచ విజేత సహా మేటి ఆటగాళ్లను పడగొట్టాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం బల్లెం విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. దీంతో ఈసారి నీరజ్ వెండి పతకం తోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే ఈసారి గోల్డ్ మెడల్ గెలవకపోయినప్పటికీ.. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అటు స్వర్ణం, ఇటు రజతం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నీరజ్ ఘనత అందుకున్నాడు.

తనకు తానే పోటీ అనుకుంటే

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా తనకు తానే ప్రధాన పోటీ అనుకున్నాడు. నేటి ఆటగాళ్లను మించి 89.45 మీటర్ల దూరం బల్లెం విసిరి.. ఔరా అనిపించాడు. అయితే ఇదే దశలో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయాడు. దీంతో మీరజ్ రజితంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తొలి ప్రయత్నంలో వీరిద్దరూ ఫౌల్ చేశారు. రెండో ప్రయత్నంలో అర్షద్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 90 మీటర్ల మార్క్ ను నీరజ్ అందుకోలేదు. ఇదే సమయంలో తన రెండో ప్రయత్నంలో నీరజ్ తన రెండవ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను సాధించాడు. గీత క్రీడాకారులు వీరిని అధిగమించలేకపోయారు. అండర్సన్ పీటర్స్ (గ్రనేడ) 88.54 మీటర్ల దూరం బల్లెం విసిరి కాంస్యం మెడల్ సాధించాడు. పాకిస్తాన్ అర్షద్ నదీం గోల్డ్ మెడల్ తో పాటు అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. గత రికార్డు ఆండ్రీస్ (నార్వే 90.57 మీటర్లు) పేరు మీద ఉంది. గత ఒలింపిక్స్ లో నీరజ్ 87.58 మీటర్లతో గోల్డ్ మెడల్ గెలిచాడు.

నీరజ్ దారి తప్పలేదు

2016లో నీరజ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ గా నిలిచాడు. గత ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ కు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. డబ్బు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, దానిని చూసి నీరజ్ ఏ మాత్రం తన మార్గాన్ని తప్పలేదు. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ లక్ష్యంగా అతడు తన ప్రతి అడుగును బలంగా వేశాడు. విదేశాల్లో శిక్షణ పొందాడు. ప్రతి విషయంలోనూ ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతున్నాడు. అన్ని పోటీల్లో కాకుండా, ఎంపిక చేసుకున్న పోటీల్లోనే పాల్గొన్నాడు. ఈ పోటీల్లో పాల్గొనే ముందు నీరజ్ తొడ కండరాలు, గజ్జల్లో గాయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్, పారిస్ డైమండ్ లీగ్ కు దూరమయ్యాడు.

సంకల్ప బలంతో

పారిస్ ఒలంపిక్స్ టార్గెట్ గా నీరజ్ బలంగా ముందుకు సాగాడు. ఏ పోటీల్లోనైనా ప్రత్యర్ధుల్లో నీరజ్ కంటే ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. 90 మీటర్ల కంటే ఎక్కువ బంధం విసిరిన వాళ్లు కూడా ఉంటారు. కానీ ఆరోజున బెస్ట్ పెర్ఫార్మన్స్ చేయడమే లక్ష్యంగా నీరజ్ బరిలోకి దిగుతాడు. పారిస్ ఎంపికల్లో ఒకే ఒక త్రో తో (89.34 మీ) ఫైనల్ చేరుకున్నాడు. అయితే ఒలింపిక్స్ లాంటి పోటీల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అన్ని కంచు పతకాలు వస్తుంటే.. నీరజ ఈసారి గోల్డ్ మెడల్ సాధిస్తాడని కోట్లాదిమంది భారతీయులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి ఆశలను మోస్తూ రాణించడం అంటే అంత సులభం కాదు. ఈ ఒలంపిక్స్ లో అతడు వెండి పతకం సాధించినప్పటికీ.. అది అతడి పోరాట పటిమను తక్కువ చేసేది కాదు. ఎందుకంటే ఆ ఆటను అతడు తన వరకే పరిమితం చేసుకోలేదు. అతడు గత ఒలింపిక్స్ లో గెలిచిన గోల్డ్ మెడల్ దేశంలో ఎంతమంది అథ్లెట్స్ పుట్టుకొచ్చేలా చేసింది. జావెలిన్ పట్ల ఆదరణ పెరిగేందుకు కారణమైంది. నీరజ్ చోప్రా వెండి పతకం సాధించాడు కాబట్టి.. మనదేశంలో బల్లేన్ని పట్టుకునే చిన్నారుల సంఖ్య ఈసారి మరింత పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.