Homeక్రీడలుNeeraj Chopra : జర్మనీకి నీరజ్ చోప్రా.. కారణం అదేనా?.. స్పోర్ట్స్ వర్గాల్లో ఎడతెగని చర్చ..

Neeraj Chopra : జర్మనీకి నీరజ్ చోప్రా.. కారణం అదేనా?.. స్పోర్ట్స్ వర్గాల్లో ఎడతెగని చర్చ..

Neeraj Chopra: పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధిస్తాడని భావించిన నీరజ్ చోప్రా.. వెండి పతకం తోనే సరిపెట్టుకున్నాడు. వెంట్రుకవాసిలో గోల్డ్ మెడల్ కోల్పోయాడు. అయినప్పటికీ వెండి పతకం సాధించి దేశంలో సంబరాలు నింపాడు. కోట్లాదిమంది భారతీయుల నమ్మకాన్ని వమ్ము కానీయకుండా.. పోడియం మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ప్రస్తుతం ఒలింపిక్స్ ముగియడంతో నీరజ్ కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.. కొద్దిరోజులుగా అతడు గజ్జల్లో గాయం (Groin injury) తో అతడు ఇబ్బంది పడుతున్నాడు. అయితే దాని నివారణ కోసం అతడు శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఇందుకు గానూ అతడు జర్మనీ వెళ్తున్నాడు.

వాయిదా వేసుకున్నాడు

ఒలింపిక్స్ కోసం నీరజ్ చోప్రా తన శస్త్ర చికిత్సను వాయిదా వేసుకున్నాడు. అంతటి బాధను అనుభవిస్తూనే భారతదేశం తరఫున ఒలింపిక్స్ ఆడాడు. వెంట్రుక వాసిలో గోల్డ్ మెడల్ కోల్పోయినప్పటికీ.. వెండికొండగా ఆవిర్భవించాడు. అయితే నీరజ్ స్వదేశానికి రాకుండా.. ఒలింపిక్స్ ముగిసిన వెంటనే పారిస్ నుంచి నేరుగా జర్మనీ వెళ్లిపోయాడు. గజ్జల్లో గాయం నీరజ్ చోప్రాను ప్రతి ఈవెంట్ లో ఇబ్బంది పడుతోంది. చికిత్స పొందగానే తగ్గుతోంది. ఆ తర్వాత మళ్లీ తిరగబెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీలో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలుసుకొని.. అతడు అక్కడికి వెళ్ళాడు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత నెలరోజుల పాటు జర్మనీలోనే ఉంటాడు. నీరజ్ చోప్రా వెంట అతడి మామయ్య భీమ్ చోప్రా ఉన్నాడు.. అతడి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం అతడే చూస్తున్నాడు.

రెండు సంవత్సరాల క్రితం

రెండు సంవత్సరాల క్రితం వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీలలో నీరజ్ కు గజ్జల్లో గాయమైంది. అప్పటినుంచి అతడు ఆ గాయంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. వైద్యులను సంప్రదిస్తూనే ఉన్నాడు. గాయం తగ్గడం, ఆ తర్వాత మళ్లీ తిరగబెట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆ సమస్యకు పరిష్కారం కోసం అతడు జర్మనీ వెళ్లాడు. అక్కడ శస్త్ర చికిత్స చేయించుకొని.. కోలుకున్న తర్వాత స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇక ఒలంపిక్స్ క్వాలిఫైయింగ్ గ్రౌండ్ లో నీరజ్ 89. 34 మీటర్ల దూరం ఈట విసరాడు. అందర్నీ వెనక్కినట్టు ఫైనల్ వెళ్లిపోయాడు. గోల్డ్ మెడల్ ఫైట్ లో.. అతడు శక్తిని మొత్తం కూడతీసుకొని ఈటను 89.45 మీటర్ల దూరం విసిరేశాడు. పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే నీరజ్ వరుసగా రెండవ ఒలంపిక్స్ లోనూ రెండవ పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్ లో పీవీ సింధు తర్వాత వరుసగా రెండు మెడల్స్ సాధించిన భారత క్రీడాకారుడిగా నీరజ్ ఘనత అందుకున్నాడు. అంతేకాదు వెండి పతకం సాధించిన అనంతరం తన సంతోషాన్ని నీరజ్ ట్విట్టర్లో పంచుకున్నాడు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular