https://oktelugu.com/

MS Dhoni: ఆ స్టార్లతో మళ్లీ ఆడాలని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్టర్‌ కూల్‌!

MS Dhoni మిస్టర్‌ కూల్‌.. ఈ పేరు చెప్పగానే క్రికెటర్లకు టక్కున గుర్తొచ్చేది ఎంఎస్‌.ధోనీ(MS.Dhoni). భారత్‌కు ప్రపంచ కప్‌తోపాటు అనేక విజయాలు అందించిన సారథి, క్రికెటర్‌. ధోనీ రిటైర్‌ అయిఏ దశాబ్దం గడిచింది. కానీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.

Written By: , Updated On : April 7, 2025 / 04:30 PM IST
MS Dhoni (3)

MS Dhoni (3)

Follow us on

MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) ప్రస్తుతం ఐపీఎల్‌–2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) తరఫున ఆడుతున్నారు. ఈ సీజన్‌లో ఆయన బ్యాటర్, వికెట్‌ కీపర్‌గా కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ, గతంలోని స్టార్‌ క్రికెటర్లతో మళ్లీ ఆడాలనే కోరికతో పాటు రిటైర్మెంట్‌ ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు.

Also Read: శ్రేయస్ అయ్యర్ భారత్ కు ఉత్తమ కెప్టెన్ కాగలడు..రికీ పాంటింగ్

గత స్టార్లతో ఆడాలనే ఆలోచన
గతంలో టీమిండియాతో కలిసి ఆడిన ఆటగాళ్లలో ఎవరితో మళ్లీ ఆడాలనుకుంటున్నారనే ప్రశ్నకు ధోనీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘నాకు మళ్లీ అవకాశం వస్తే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్‌ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌లతో ఆడాలని కోరుకుంటా. వీరూ పా (సెహ్వాగ్‌) ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసేవాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆడటం కష్టం. అలాంటి సమయంలో ఎలా ఆడాలో నిర్ణయించడం సులభం కాదు. అయినా వీరంతా ఆ పరిస్థితుల్లో అద్భుతంగా రాణించారు. సెహ్వాగ్, దాదా (గంగూలీ) ఆడుతుంటే చూడటానికి అందంగా ఉండేది’’ అని ధోనీ పేర్కొన్నారు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను గుర్తు చేస్తూ, యువరాజ్‌ సింగ్‌ ఆరు సిక్సర్లతో చెలరేగిన వైనాన్ని ప్రశంసించారు. ‘‘వీరంతా తమ కెరీర్‌లో మ్యాచ్‌ విన్నర్లు’’ అని కొనియాడారు.

ఐపీఎల్‌–2025లో సీఎస్కే ప్రదర్శన
ఐపీఎల్‌–2025 18వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో జట్టు పాయింట్ల టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిలో ధోనీ బ్యాటింగ్‌లో పెద్దగా సత్తా చాటలేకపోవడంతో ఆయన రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ధోనీ ఈ విషయంపై స్పష్టమైన సమాధానంతో అభిమానులకు ఊరటనిచ్చారు.

రిటైర్మెంట్‌ ఊహాగానాలపై క్లారిటీ
‘‘నేను ఇప్పుడు రిటైర్‌ కావడం లేదు. ఐపీఎల్‌ను ఒక్కో సంవత్సరం చొప్పున తీసుకుంటా. నాకు ఇప్పుడు 43 ఏళ్లు, ఈ సీజన్‌ ముగిసే సమయానికి 44 ఏళ్లు అవుతాయి. ఆ తర్వాత నాకు 10 నెలల సమయం ఉంటుంది. అప్పుడు నా శరీరం ఆధారంగా నిర్ణయం తీసుకుంటా’’ అని ధోనీ తెలిపారు. సీజన్‌ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచన లేదని, శరీరం సహకరిస్తే మరో సీజన్‌ ఆడే అవకాశం ఉందని సూచించారు.

ధోనీ నాయకత్వంలో టీమిండియా 2007 టీ20 వరల్డ్‌ కప్, 2011 వన్డే వరల్డ్‌ కప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడిన సమయంలో ధోనీ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ, 43 ఏళ్ల వయసులోనూ వికెట్‌ కీపింగ్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు.