MI Vs RR: రోహిత్ శర్మ అంటే హిట్ మాన్. అయితే ఫోర్లు.. లేకుంటే సిక్సర్లు.. కొడితే సెంచరీలు.. నిలబడితే హాఫ్ సెంచరీలు.. ఐపీఎల్ సీజన్లోనూ అతడు మెరుపులు మెరిపిస్తున్నాడు. ముంబై జట్టు గెలవక పోయినప్పటికీ.. తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కానీ రాజస్థాన్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో కీపర్ సంజూ సాంసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఈ అవుట్ ద్వారా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం 17వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏ ఆటగాడు నమోదు చేయని విధంగా.. అత్యధిక సార్లు డక్ ఔట్ అయిన చరిత్రను రోహిత్ శర్మ సమం చేశాడు. అంతకుముందు ఇది దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో 17 సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా డక్ అవుట్ అయిన రోహిత్ శర్మ.. దినేష్ కార్తీక్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తర్వాత గ్లేన్ మాక్స్ వెల్(15), పీయూష్ చావ్లా (15), మన్ దీప్ సింగ్ (15), సునీల్ నరైన్(15), తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు.
ముంబై మైదానాన్ని అంచనా వేయడంలో రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ విజయవంతమయ్యాడు. మైదానంపై ఉన్న తేమను వినియోగించుకుని నిప్పులు చెరిగేలా బంతులు వేశాడు. ఫలితంగా రోహిత్ శర్మ (0), నమన్ ధీర్(0), ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రేవిస్(0) వరసగా ఔటయ్యారు. ఫలితంగా ముంబై జట్టు 125 పరుగులకే ఆల్ అవుట్ అయింది. హార్దిక్ పాండ్యా 34, తిలక్ వర్మ 32 పరుగులు చేయడంతో ముంబై ఆ కాస్త స్కోరైనా చేయగలిగింది.. లేకుంటే వందలోపే చాప చుట్టేసేది.. బౌల్ట్ మూడు వికెట్లతో చెలరేగితే.. చాహల్ మూడు వికెట్లు పడగొట్టి ముంబై జట్టు ను వణికించాడు. బర్గర్ రెండు వికెట్లు పడగొడితే, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.