Parliament Session 2024: ప్రతిపక్ష నేతలకు నీళ్లు తాగించిన మోదీ…. వైరల్ వీడియో

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానం ఇస్తూ.. ప్రజలు తమ పాలన, ట్రాక్‌ రికార్డు చూశారని చెప్పారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 9:01 am

Parliament Session 2024

Follow us on

Parliament Session 2024: 18వ పార్లమెంటు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు సమావేశౠలు హాట్‌ హాట్‌గా జరుగుతున్నాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం.. స్పీకర్‌ ఎన్నిక తర్వాత సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చపై ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం సభలో మాట్లాడారు. విపక్ష నేతల నిరసనల మధ్యనే మోదీ ప్రసంగం కొనసాగింది. 18వ లోక్‌సభలో ప్రతిపక్షం బలంగా ఉండడంతో లోక్‌సభలో మోదీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు నిరసనల హోరు కనిపించింది.

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్లు…
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానం ఇస్తూ.. ప్రజలు తమ పాలన, ట్రాక్‌ రికార్డు చూశారని చెప్పారు. తమ పదేండ్ల హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతోపాటు విపక్ష నేతలపై సెటైర్లు వేశారు. మీకు వచ్చింది 99/100 కాదని, 99/543 అని గుర్తు చేశారు.

ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు
ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మణిపూర్, నీట్‌ అంశాలపై మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. దీంతో విపక్ష సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీళ్లు ఇచ్చిన మోదీ..
ఇదిలా ఉంటే.. మోదీ ప్రసంగ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం లోక్‌సభలో జరిగింది. మోదీ మాట్లాడుతుండగా సిబ్బంది రెండు గ్లాసుల్లో తాగేందుకు నీళ్లు తీసుకొచ్చారు. ఈ సమయంలో మోదీ ఒక గ్లాసులోని నీటిని నిరసన తెలుపుతున్న విపక్ష నేతలకు అందించారు. ఒక నేత వాటిని సున్నితంగా నిరాకరించగా, ఆయన పక్కనే ఉన్న మరో నేతా వాటిని తీసుకుని తాగారు. దీనికి సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.