KKR Vs RR IPL: ఆరు ఓవర్లలో 96.. కోల్ కతా ను ఒక్కడై బట్లర్ ఓడించాడు

కోల్ కతా విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. యశస్వి జైస్వాల్ (19; 9 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడినప్పటికీ వెంటనే నిష్క్రమించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 17, 2024 8:18 am

KKR Vs RR IPL

Follow us on

KKR Vs RR IPL: మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల మైదానాల్లోనూ ఆరు ఓవర్లలో 96 పరుగులు చేయడం అంత సులభం కాదు. పైగా అప్పటికే ఆరుగురు కీలక బ్యాటర్లు అవుట్ అయ్యారు.. ఏ మూలన కూడా రాజస్థాన్ జట్టులో ఆశలు లేవు. ఓ ఎండ్ లో బట్లర్ పోరాడుతున్నప్పటికీ.. అతడికి సహకరించేవారు లేరు. దీంతో విజయం మాదే అనే గర్వంలో కోల్ కతా ఆటగాళ్లు ఉన్నారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తామనే ఆశల్లో ఉన్నారు. ఇక అప్పుడు మొదలైంది బట్లర్ ఊచకోత.. బంతి మీద కోపం ఉన్నట్టు.. బౌలర్ల మీద దీర్ఘకాలం విరోధం ఉన్నట్టు.. కసి కొద్దీ బాదాడు.. బంతిని 360 డిగ్రీల్లో చితక్కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు ఆరు ఓవర్లలో 96 పరుగులు వచ్చాయి. అసాధ్యం అనుకున్న గెలుపు రాజస్థాన్ వశం అయింది.

ఈ మ్యాచ్ లో బట్లర్ ఆడిన ఇన్నింగ్స్ అజేయం.. అనన్యసామాన్యం. ఒంటి చేత్తో అతడు రాజస్థాన్ జట్టుకు కోల్ కతా జట్టు పై రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.. కోల్ కతా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న బట్లర్.. 60 బంతుల్లో 107* పరుగులు చేశాడు. అతడి విరోచిత ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. బట్లర్ మాత్రమే కాకుండా రియాన్ పరాగ్ (34; 14 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), పావెల్(26; 13 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు) రాణించడంతో రాజస్థాన్ 20వ ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కోల్ కతా విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని చేదించింది.

కోల్ కతా విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. యశస్వి జైస్వాల్ (19; 9 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడినప్పటికీ వెంటనే నిష్క్రమించాడు.. కెప్టెన్ సంజు సాంసన్(12) నిలబడలేకపోయాడు. ఈ దశలో వచ్చిన బట్లర్, పరాగ్ చెలరేగి ఆడారు. 7.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 97 పరుగుల స్థాయికి రాజస్థాన్ జట్టును తీసుకొచ్చారు. మూడో వికెట్ కు 50 పరుగులు నెలకొల్పిన ఈ జోడి.. హర్షిత్ రానా బౌలింగ్లో పరాగ్ రూపంలో విడిపోయింది. పరాగ్ ఔట్ అయిన తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తలకిందులైంది. ధృవ్ జురెల్ (2), అశ్విన్(8), హిట్ మేయర్ (0) వెంట వెంటనే అవుట్ కావడంతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. బట్లర్ క్రీజ్ లో ఉన్నప్పటికీ పరుగులు రావడం కష్టమైంది. అప్పటికి రాజస్థాన్ స్కోరు 14 ఓవర్లలో 128/6. జట్టు సాధించాల్సిన రన్ రేట్ 16 కు చేరుకుంది. ఈ క్రమంలో కోల్ కతా జట్టు మ్యాచ్ పై మరింత పట్టు బిగించింది. ఈ దశలో బట్లర్, పావెల్ విధ్వంసం సృష్టించారు.. ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా 14.1 ఓవర్ల నుంచి 16.4 ఓవర్ల దాకా రాజస్థాన్ ఏకంగా 50 పరుగులు రాబట్టింది. మళ్లీ మ్యాచ్ పై పట్టు బిగించింది. ఈ దశలో పావెల్, స్టార్క్ వెనుతిరిగారు.

చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయ సమీకరణం 12 బంతులకు 28 పరుగులుగా మారిన నేపథ్యంలో.. ఒక ఎండ్ లో బట్లర్ ఉన్నప్పటికీ.. అతడికి సహకరించే వారు లేరు.. దీంతో టెయిలెండర్లతోనే బట్లర్ దూకుడు కొనసాగించాడు. హర్షిత్ రానా బౌలింగ్లో రెండు సిక్సులు, ఫోర్ కొట్టాడు. ఫలితంగా ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.. చివరి ఓవర్ వరుణ్ చక్రవర్తి వేయగా.. అతడు వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి బట్లర్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత మూడు బంతులను బౌలర్ డాట్స్ గా వేశాడు. మరోవైపు ఆవేశ్ ఖాన్ ఉండటం.. సింగిల్స్ తీసే అవకాశం వచ్చినప్పటికీ బట్లర్ తీయలేదు. దీంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ తర్వాత రెండు బంతుల్లో వరుసగా 2, 1 చేసిన బట్లర్… పింక్ ఆర్మీ ని గెలిపించాడు.