Jay Shah: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లపై ఎట్టకేలకు ఓపెన్ అయిన బీసీసీఐ సెక్రటరీ జై షా..

సరిగ్గా ఇన్నాళ్లకు బీసీసీఐ సెక్రటరీ జై షా అసలు విషయం ఒప్పుకున్నారు. ఆటగాళ్లపై కఠిన వైఖరి అవలంబించిన మాట వాస్తవమని పేర్కొన్నారు. కాకపోతే వారంతా కూడా ఫిట్ గా ఉండాలని, జట్టుకు అద్భుతమైన సేవలు అందించాలనేదే తమ ఉద్దేశమని జై ష పేర్కొన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 17, 2024 4:59 pm

Jay Shah

Follow us on

Jay Shah: బీసీసీఐ ప్రతి ఏడాది ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టుకు సంబంధించి ఈసారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు అవకాశం లభించలేదు. పైగా వారు కాంట్రాక్ట్ నుంచి తిరస్కరణకు గురయ్యారు. దీంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో మీడియా ఈ విషయం పై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా బీసీసీఐ సెక్రటరీ జై షా దాటవేశారు.. ఈ విషయంపై మీడియాలో రకరకాల కథనాలు వినిపించాయి. వర్ధమాన ఆటగాళ్లపై బీసీసీఐ సెక్రెటరీ కఠిన వైఖరి అవలంబిస్తున్నారని వార్తలను ప్రసారం చేశాయి. అయితే దీనిపై బీసీసీఐ బాధ్యులు మండిపడ్డారు. ఇలాంటి నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని హెచ్చరించారు. అయితే ఆ కథనాలలో తప్పు ఉందని మాత్రం చెప్పలేదు. ఇలాంటి వాటి వల్ల బీసీసీఐ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని మాత్రమే చెప్పారు.

సెక్రటరీ ఒప్పుకున్నారు

సరిగ్గా ఇన్నాళ్లకు బీసీసీఐ సెక్రటరీ జై షా అసలు విషయం ఒప్పుకున్నారు. ఆటగాళ్లపై కఠిన వైఖరి అవలంబించిన మాట వాస్తవమని పేర్కొన్నారు. కాకపోతే వారంతా కూడా ఫిట్ గా ఉండాలని, జట్టుకు అద్భుతమైన సేవలు అందించాలనేదే తమ ఉద్దేశమని జై ష పేర్కొన్నారు.. ఎందుకంటే అప్పట్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ దేశవాళి క్రికెట్ ఆడలేదు. ఇదే విషయాన్ని పదేపదే బీసీసీఐ సెక్రెటరీ జై షా చెప్పారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో వారిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తిరస్కరణకు గురయ్యారు. జై షా అవలంబించిన కఠిన వైఖరి వల్లే వీరికి సెంట్రల్ కాంట్రాక్టులో స్థానం లభించలేదని వార్తలు వినిపించాయి. అయితే అవి నిజమేనని ఇన్నాళ్లకు జై షా ఒప్పుకున్నారు.” సెప్టెంబర్ ఐదున ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో అయ్యర్, కిషన్ భాగస్వాములు అవుతున్నారు. బీసీసీఐ తీసుకున్న కఠిన చర్యల వల్ల వారిద్దరూ అందులో ఆడుతున్నారు. మేము రోహిత్, విరాట్, జస్ ప్రీత్ బుమ్రా కు మాత్రమే విశ్రాంతి ఇచ్చాం. ఎందుకంటే టీమిండియా తన తదుపరి టోర్నీలను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వారు గాయాల బారిన పడితే అది జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వారికి విశ్రాంతి ఇచ్చాం. ఇటీవల రవీంద్ర జడేజా గాయపడినప్పుడు నేను ఆయనకు ఫోన్ చేశాను. కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడాలని సూచించాను. దానికి అతడు ఒప్పుకున్నాడని” జై షా పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 19 నుంచి..

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.. అది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. గత ఏడాది టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలిచి, గదను అందుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అందువల్లే గట్టి ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ఒకవేళ టీమ్ ఇండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలిస్తే.. రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు నమోదవుతుంది. ఇప్పటికే అతని ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది.