BCCI – IPL : భారత్ క్రికెట్ కు ప్రమాదకరంగా ఐపీఎల్.. కాసులకే ఆటగాళ్ళు ప్రాధాన్యం..!

క్రికెట్ లో ఆటగాళ్లు దేశానికి ఆడితే రూపాయి ఆదాయం వస్తుంది. అదే ఐపీఎల్ లో ఆడితే 100 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే పది రెట్లు ఎక్కువగా ఆదాయం ఆటగాళ్లకు వస్తుంది.  దీనివల్ల దేశం కంటే ఐపీఎల్ కే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.

Written By: BS, Updated On : June 25, 2023 10:57 am
Follow us on

BCCI – IPL : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కి కాసుల కురిపించే కామధేనువుగా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత్ క్రికెట్ ను మింగేయబోతోందా..? ఐపీఎల్ ఆడుతూ డబ్బులు సంపాదించడంపై దృష్టి సారించిన భారత ఆటగాళ్లు దేశం కోసం ఆడడాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదా..? అంటే అవునన్న సమాధానమే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు నుంచి వస్తోంది. తాజాగా అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్. ఐపీఎల్ భవిష్యత్తులో భారత క్రికెట్ బోర్డును మింగేయబోతుందని ఆయన హెచ్చరించాడు. ప్రసాద్ తో పాటు ఎంతోమంది మాజీ క్రికెటర్లు ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత భారత్ క్రికెట్ దశ మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే బీసీసీఐకు, భారత ఆటగాళ్లకు ఐపీఎల్ కాసులు కురిపించే కామధేనువులా మారింది. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కకపోయినా పరవాలేదు గాని, ఐపీఎల్ లో ఏదో ఒక జట్టులో సభ్యుడిగా ఉంటే చాలు అన్న భావన క్రికెటర్లలో పెరిగిపోయింది. ఎందుకంటే ఒక్కో సీజన్ కు కనీసంలో కనీసం.. ఆటగాడి స్థాయిని బట్టి రెండు నుంచి పది కోట్లు వరకు ఆదాయం ఈ లీగ్ వల్ల వస్తోంది. దీంతో భారత జట్టుకు ఆడాలన్న లక్ష్యాన్ని చాలా మంది ఆటగాళ్లు మర్చిపోతున్నారు. ఐపీఎల్ లో అదరగొడితే చాలు.. వచ్చే సీజన్ కు మరింత రెట్టింపు ఆదాయం వస్తుందన్న భావన ఆటగాళ్లలో పెరిగిపోయింది. వెరసి టీమిండియాకు ఆడేటప్పుడు కసితో, విజయమే లక్ష్యంగా ఆడాలన్న కనీస స్పృహ కూడా ఆటగాళ్లలో లేకుండా పోతుంది. దీనివల్లే అంతర్జాతీయ క్రికెట్లో, ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీ ల్లో భారత జట్టు ఘోరంగా పరాభవం మూటగట్టుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి.
బీసీసీఐను మింగేసే స్థితికి ఐపీఎల్..
ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఐపీఎల్ ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆదాయంతో రానున్న రోజుల్లో బిసిసిఐని ఐపీఎల్ మింగేసే పరిస్థితి వస్తుందని ఆందోళనను పలువురు మాజీ క్రికెటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో ఎక్కువగా ఆదాయం వస్తుండడంతో దీనికి మాత్రమే ఆటగాళ్లు పరిమితమయ్యే ప్రమాదం భవిష్యత్తులో ఉందని, దీనివల్ల భారత జట్టుకు నాణ్యమైన క్రికెటర్లు వచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు ఒక అనామక జట్టుగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఐపీఎల్ వంటి లీగ్ లు పూర్తిగా కమర్షియల్ టోర్నమెంట్స్.  ఈ ప్రాంచైజీ లీగ్ లు కారణంగా అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ కారణంగా భారత జట్టు ఐసీసీ నిర్వహించే టోర్నీలో దారుణంగా విఫలమవుతోంది. ఇదంతా ఐపిఎల్ ప్రభావమేనని క్రికెట్ విశ్లేషకుల భావన. ఐపీఎల్ కారణంగా విరామం లేని ఆట ఆడాల్సిన పరిస్థితి భారత ఆటగాళ్లకు ఏర్పడుతుంది. దీంతో ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు భారత జట్టు ఆటగాళ్లు. ఇలానే, కొనసాగితే భవిష్యత్తులో బీసీసీఐ కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. లీగ్ లు కారణంగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ కు మనగడ
కూడా ఉండకపోవచ్చని పలువురు పేర్కొంటున్నారు.  ఫుట్బాల్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడటం కంటే కూడా ఆ లీగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో క్రికెట్లో ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
పది రెట్లు అదనంగా ఆటగాళ్లకు ఆదాయం..
క్రికెట్ లో ఆటగాళ్లు దేశానికి ఆడితే రూపాయి ఆదాయం వస్తుంది. అదే ఐపీఎల్ లో ఆడితే 100 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే పది రెట్లు ఎక్కువగా ఆదాయం ఆటగాళ్లకు వస్తుంది.  దీనివల్ల దేశం కంటే ఐపీఎల్ కే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో బీసీసీఐ ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని, దీన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు ప్రసాద్. లీగ్ క్రికెట్ కు జనాలు అలవాటు పడితే ద్వైపాక్షిక సిరీస్ లను చూసే వారుండరని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ వంటి లీగ్ క్రికెట్ నిరంతరాయంగా ఆడుతుండడం వల్ల మేజర్ టోర్నీల్లో భారత జట్టు ఓటమిపాలవుతోందని ఈ సందర్భంగా ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.