IPL 2027: ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్ల మీద కోట్ల వర్షం కురిసింది. వారికి ఆయా జట్ల యాజమాన్యాలు పోటీపడి కనక వర్షం కురిపించాయి. వారి మీద భారీ అంచనాలు పెట్టుకున్నాయి. కానీ, వాటిని నిలబెట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. దీంతో యాజమాన్యాలు ఒకటి, రెండు అవకాశాలు ఇచ్చాయి. ఆ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్లు పొమ్మనలేక పొగబెట్టాయి. ఫలితంగా ఆ ప్లేయర్లు బయటికి రావాల్సిన పరిస్థితి.
ఐపీఎల్ 2027 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని జట్ల సారధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా తమ సారథ్యం వహిస్తున్న జట్లనుంచి బయటకు రావాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ జాబితాలో హార్థిక్ పాండ్యా.. రిషబ్ పంత్ ఉన్నారు. హార్దిక్ ముంబై జట్టుకు.. రిషబ్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. గత రెండు సీజన్లుగా వీరిద్దరూ అంతగా ఆయా జట్ల మీద ప్రభావం చూపించలేకపోయారు. మీరు మాత్రమే కాకుండా చెన్నై జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా విఫల సారధి జాబితాలో ఉన్నాడు.
లక్నో జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు అందించలేకపోవడంతో.. 27 కోట్ల పంత్ తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఏకంగా 15 కోట్లకు ఢిల్లీ జట్టుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేగంగా అడుగులు వేస్తున్న సమాచారం. 27 కోట్ల ఆటగాడు సరిగ్గా ఆడ లేకపోవడంతో విఫల సారథిగా మిగిలిపోయాడు.
అత్యంత విజయవంతమైన గుజరాత్ జట్టు నుంచి ముంబైకి మారిపోయాడు హార్దిక్. 2024లో అతడు ముంబై జట్టుకు నాయకుడిగా వచ్చాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ముంబై జట్టు అతని నాయకత్వంలో గొప్పగా ఎదగ లేక పోయింది. మైదానంలో వ్యూహాత్మకంగా పాండ్యా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో జైస్వాల్ మీద కన్ను వేసినట్టు సమాచారం. జైస్వాల్ కూడా ముంబై జట్టుకు ఆడాలని అనుకుంటున్నాడు.. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్ని వాస్తవ రూపం దాల్చుతాయో తేలాల్సి ఉంది.
