Kapu Politics AP: ఏపీ రాజకీయాలు ఎప్పుడు కాపులు చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. కాపులను తమ వైపు టర్న్ చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మెజారిటీ కాపులు కూటమికి అండగా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది అంత ఈజీ కాదు. అయితే అదే పనిగా ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గోదావరి జిల్లాలో కాపు సదస్సులు నిర్వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచిన వారికి రాజకీయంగా తాము అండగా నిలబడతామని చెబుతున్నారు. అయితే ఈ కాపు సమావేశాలు రాజకీయ ప్రేరేపితం అన్న టాక్ కూడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీల స్పాన్సర్ షిప్ తోనే ఈ సమావేశాల నిర్వహణ జరుగుతుందన్నది ఒక అనుమానం. ఆపై బహిరంగ రహస్యం కూడా.
* విసిగి వేసారి పోయిన కాపులు..
అయితే తమ చుట్టూ జరిగే రాజకీయం కాపులకు తెలియంది కాదు. దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేత వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన హత్య జరిగింది. టిడిపి మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రంగా హత్య కేసు విచారణ జరిగి నిందితుల అరెస్టు జరుగుతుందని చాలా ఊహించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరెస్టు జరగలేదు సరి కదా దానికోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. అది మొదలు ఎన్నో ఎన్నికలు వచ్చాయి. కాపులతోపాటు మోహన్ రంగా ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంటే ఎన్నికల కథా వస్తువుగా కాపులను తీసుకున్నారన్నమాట ఏపీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు.
* వర్కౌట్ కాని సదస్సులు..
మొన్ననే గోదావరి జిల్లాలో ఒక సదస్సు పెట్టారు కాపుల తో. పట్టుమని పదివేల మంది కూడా రాలేదు. శ్రీకాకుళంలో సైతం కాపుల సభ పెట్టారు. తూర్పు కాపుల పేరిట ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పట్టుమని వెయ్యి మంది కూడా రాలేదు. ఒక్క మాట నిజం కాపులు విసిగి వేసారి పోయారు. అంతెందుకు 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన కంచాల ఉద్యమం చేపట్టమన్నాడు. దీపాలు వెలిగించమన్నాడు. అన్ని చేశారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే ఉద్యమాన్ని మూసేశాడు. ఆయనది సైతం రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని తేలిపోయింది. అందుకే ఎందుకు వచ్చింది ఈ బాధ.. ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి జై కొడతాం అన్నట్టు మెజారిటీ కాపుల అభిప్రాయంగా మారింది. అంతే తప్ప రాజకీయ ప్రేరేపిత కుల సదస్సులకు కాలం చెల్లిపోయింది. చంద్రబాబు విషయంలో కాపులను దూరం చేస్తామంటే మధ్యలో పవన్ ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకుంటే మంచిది.
