Dhoni- Jadeja: ధోనీ – జడ్డూది విడదీయరాని బంధం.. జడేజా కష్టంలో అండగా ధోనీ..!

ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో జడ్డు రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపిఎల్ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సి వచ్చింది.

Written By: BS, Updated On : May 31, 2023 8:32 am

Dhoni- Jadeja

Follow us on

Dhoni- Jadeja: ఇండియన్ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా దూసుకుపోతున్న రవీంద్ర జడేజా ఐపీఎల్ లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఆడుతున్న ఈ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోని తీర్చిదిద్దిన ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. జడేజాకు దూకుడు ఎక్కువ. అటువంటి జడేజాను జట్టు అవసరానికి అనుగుణంగా ధోని వినియోగిస్తూ మంచి ఫలితాలను రాబట్టాడు. వీరిద్దరి అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఎన్ని వివాదాలు వచ్చినా జడ్డూను మహేంద్రసింగ్ ధోని వెనకేసుకొచ్చాడు. ధోనీ కోసం ఎంత కఠిన పోరాటమైనా చేసేందుకు కూడా రవీంద్ర జడేజా వెనుకాడలేదు. అంతటి సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఉంది.

భారత క్రికెట్ లో ప్రతిభను గుర్తించి చేరదీయడం, ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని శైలి వేరు. కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ధోనీ నీడన ఎగామని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించరు. ఇక జడేజా అయితే తన కెరీర్ గురించి ఇటీవల చెబుతూ.. ‘ నా క్రికెట్ ప్రయాణం ఇద్దరు మహేంద్రుల మధ్యలోనే జరిగింది’ అని పేర్కొన్నాడు. వీరిలో ఒకరు కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ కాగా, మరొకరు ధోని. జడేజా కెరీర్ ను మహేంద్రసింగ్ ఎంతగానో ప్రభావితం చేశాడు. జడేజా చిక్కుల్లో పడిన ప్రతిసారి ధోని అతనికి ఏదో ఒకరకంగా అండగా ఉంటూ వచ్చాడు. తాజాగా అద్భుతమైన ఫోర్ తో చెన్నైకి ఐపీఎల్ కప్ అందించిన అనంతరం జడ్డు మాట్లాడుతూ ఈ కప్ ను ధోనీకి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు.

సెయింట్ లూసియా ఘటన తరువాత అండగా..

2009లో జడేజా క్రికెట్ లో అడుగుపెట్టాడు. 2010 భారత్ టి20 ప్రపంచ కప్పులో శ్రీలంక చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత కొన్ని గంటల్లో ఆరుగురు భారత క్రికెటర్లతో కలిసి జడేజా శ్రీలంకలోని సెయింట్ లూసియా పబ్ కు వెళ్ళాడు. అక్కడ వారికి కొందరు అభిమానులతో గొడవ జరిగింది. ఈ విషయం వివాదాస్పదమైంది. దీంతో బీసీసీఐ నుంచి జడ్డుకు షోకాజ్ నోటీసు అందుకున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇటువంటి ఘటనలో ఇరుక్కోవడం అతడికి ఇబ్బందికరంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ధోని నుంచి అతడికి పూర్తి మద్ధతు లభించింది. ఒక క్షమాపణ లేఖతో వివాదం సద్దుమణిగేట్టు చేశాడు ధోనీ.

ఐపీఎల్ లోను అండగా నిలిచిన ధోని..

ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో జడ్డు రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపిఎల్ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సి వచ్చింది. 2011లో కొచ్చి జట్టు అతన్ని కొనుగోలు చేసింది. కానీ, అదే ఏడాది ఆ జట్టును ఐపీఎల్ నుంచి రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో జడేజా మళ్లీ వేలానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ధోని నేతృత్వంలో అంతర్జాతీయ జట్లలో ఆడుతున్న అతనిని సీఎస్కే భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. ఈ క్రమంలో వేలంలో డెక్కన్ చార్జర్స్ తో పోటీ పడింది. నాటి నుంచి చెన్నైలోనే జడ్డు ఐపీఎల్ ప్రస్థానం కొనసాగింది. 2022లో ధోని నుంచి నాయకత్వ బాధ్యతలు కూడా అందుకున్నాడు. కెప్టెన్సీ నిర్వహించిన ఎనిమిది మ్యాచ్ ల్లో వరుసగా నాలుగు ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతని బ్యాటింగ్ కూడా దెబ్బతింది. పక్కటెముకలు నొప్పి అని ఆ తరువాత నుంచి టోర్నీకి దూరం అయ్యాడు. దీంతో తొమ్మిదో మ్యాచ్ నాటికి మహి మరోసారి కెప్టెన్సీ భారం తలకెత్తుకున్నాడు. కానీ సీఎస్కే పరిస్థితి మారలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు జడేజా సిఎస్కే సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేశాడు. ఎల్లో జెర్సీతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో ధోని – జడ్డు మధ్య బంధం బీటలు వారిందని భారీగా ప్రచారం జరిగింది. అప్పటికే సీఎస్కే యాజమాన్యంతో వెభేదించి సురేష్ రైనా కూడా జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో జడ్డు కూడా అదే బాట పడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా 2022 నవంబర్ లో తాను చెన్నైకి ఆడుతున్నట్లు ప్రకటించాడు. దీంతోపాటు ధోనీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఫోటోను షేర్ చేశాడు.

సర్ బిరుదు వెనుక ఉన్న మిస్టర్ కూల్..

అభిమానులు జడ్డు పేరుకు ముందు సర్ ను తగిలిస్తారు. తొలిసారి స్వయంగా ధోనీనే జడ్డుకు ఈ బిరుదు ఇచ్చాడు. దీని వెనక ఒక ఆసక్తికరమైన ఘటన ఉంది. 2013లో ఐపీఎల్ లో ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే జట్టు విజయం కోసం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఉన్న జడ్డుకు ఆర్సిబి బౌలర్ ఆర్పీసింగ్ వేసిన షార్ట్ ఫిచ్ వైడ్ బంతిని కొట్టి పరుగు తీశాడు. కానీ థర్డ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్న ఫీల్డర్ రామ్ పాల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో వికెట్ దక్కిందని కోహ్లీ సంబరాలు మొదలు పెట్టాడు. అంతలోనే అంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించాడు. నో బాల్ ప్లస్ ఒక పరుగు తీయడంతో సీఎస్కే ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ సందర్భంగా జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతూనే వరుసగా ధోనీ ట్వీట్లు చేశాడు. ‘మీరు సర్ జడేజాను ఒక బంతికి రెండు పరుగులు చేయమంటే అతడు ఒక బంతి మిగిలి ఉండగానే గెలిపిస్తాడు. అంతే కాదు రజిని సర్ ఎప్పుడైనా సర్ జడేజా బౌలింగ్ ఎదుర్కోవాల్సి వస్తే ఆ సమరాన్ని క్లాస్ ఆఫ్ టైటాన్స్ గా పిలుస్తారు’ అని ధోనీ ట్విట్ చేశాడు. అప్పటి నుంచి సర్ గా పేరు పాపులర్ అయింది.

టీ కప్పులో తుఫానుగా మారిపోయిన వివాదం

2023 ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో ధోని – జడేజా మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. అంతకు ముందు రోజు కర్మ పోస్ట్ చేశాడు. మరోవైపు జడ్డు భార్య రివాబా కూడా నీ సొంత మార్గంలో వెళ్ళు అంటూ పోస్టుపై కామెంట్ చేసింది. ఈ పరిణామాలు అభిమానుల్లో అనుమానాలు పెంచాయి. ఆ తర్వాత కూడా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా మైదానం వద్దకు వచ్చి జడ్డుతో ఏదో మాట్లాడి ప్రోత్సహించి వెళ్ళాడు. మళ్ళీ 2022 పరిస్థితి పునరావృతం అవుతుందా..? అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఇవన్నీ కేవలం ఒక ఊహాగానాలే అని జడ్డు ఫైనల్ లో తేల్చేశాడు. జట్టు కష్ట కాలంలో గిల్ ను జడ్డు అవుట్ చేయడంతో పాటు చివరి ఓవర్లో సాహసోపేతమైన షాట్లతో చెన్నైకు అయిదో సారి ఐపీఎల్ కప్ అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన ధోనీ.. జడేజాను ఏకంగా గాల్లోకి ఎత్తేశాడు. ఈ కప్ ను ధోనీకి అంకితం చేస్తున్నామని జడ్డు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ లో ఐపీఎల్ ట్రోఫీని జడ్డు భార్య ఒడిలో పెట్టి మరీ ఫోటో దిగాడు. అదీ ధోనీ- జడ్డు బంధం. ఈ బంధానికి గుర్తుగా జడ్డు ఇన్ స్టాగ్రామ్ లో ధోని జడ్డు మూమెంట్ ప్రొఫైల్ పిక్ గా వెలిసింది.