India Women Vs Australia Women: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. ఎందుకంటే ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో టీమ్ ఇండియా ఓడిపోవడంతో.. పాయింట్లు పరంగా కాస్త వెనుకబడింది. గ్రూపులో ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. భారత జట్టు సెమీఫైనల్ వెళ్లాలంటే కష్టంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా సర్వశక్తులు ప్రదర్శించాలి.
టి20లో ఆస్ట్రేలియా టీం మీడియా కంటే బలమైన జట్టు. దాదాపు ఒకటో స్థానం నుంచి మొదలు పెడితే ఎనిమిదో స్థానం వరకు ఆస్ట్రేలియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయగల సమర్థులు. బౌలింగ్లో కూడా ఆ జట్టు అత్యంత భయంకరంగా ఉంది. ఇక ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాలలో భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న నేపథ్యంలో.. టీమిండియా ప్లేయర్లు వీరోచితమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి విఫలమైంది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్లో ఆమె మీద భారీగా అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ కౌర్ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది. షఫాలీ వర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. ఆమెకు అండగా నిలిచే ప్లేయర్లు కరువైపోయారు.. జమీమా ఇప్పటివరకు తన రేంజ్ ఆట తీరు కొనసాగించలేదు. బౌలింగ్లో శ్రీ చరణి అదరగొడుతోంది.. ఫేస్ బౌలింగ్లో టీమ్ ఇండియా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్లో టీమిండియా తనలోపాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్ ఇప్పటివరకు ప్రూఫ్ చేసుకోలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బలపడకపోతే ఫలితం వేరే విధంగా ఉంటుంది.
మరోవైపు ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే సెమీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం నాడు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటుంది కాబట్టి సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ మీద దక్షిణాఫ్రికా గెలిచి.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతే అప్పుడు కౌర్ సేన ఇంటికి రావాల్సి ఉంటుంది.. ఎందుకంటే దక్షిణాఫ్రికా గెలిస్తే నెట్ రన్ రేట్ అమాంతం పెరుగుతుంది. ఈ సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్ వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియా పై విజయం సాధించాల్సిందే.
ఇటీవలి మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ లో అద్భుతమైన విజయం సాధించింది. నాటి మ్యాచ్లో జెమీమా సూపర్ సెంచరీ తో ఆకట్టుకుంది వరల్డ్ ఛాంపియన్లకు షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో సఫారీ మహిళల మీద భారత్ గెలిచింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే టీమిండియా దర్జాగా సెమీఫైనల్ వెళ్తుంది. సాయంత్రం 7:30 నుంచి ఈ మ్యాచ్ లైవ్ ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు జెమీమా మీద ఉన్నాయి. మరి వాటిని ఆమె ఏ విధంగా అందుకుంటుందో చూడాల్సి ఉంది.
