India Vs Zimbabwe: జింబాబ్వేతో నాలుగో t20 నేడు.. భారత జట్టును ఊరిస్తున్న సిరీస్ విజయం

భారత బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే మూడవ టి20 మ్యాచ్ లో జింబాబ్వే ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్ లో భారత బౌలింగ్ పూర్తిగా గతి తప్పింది. ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. ఆ స్థాయిలో సత్తా చాటిందంటే దానికి కారణం భారత్ బౌలింగ్ లో పస లేకపోవడమే. ఈ క్రమంలో భారత బౌలర్లు తుది వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 13, 2024 6:51 pm

India Vs Zimbabwe

Follow us on

India Vs Zimbabwe: టి20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. మరో సిరీస్ ను దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. శనివారం జింబాబ్వేతో గిల్ ఆధ్వర్యంలోని టీమిండియా నాల్గవ టి20 మ్యాచ్ ఆడనుంది. ఐదు టి 20 మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ జింబాబ్వే గెలిచింది. మిగతా రెండు మ్యాచ్లలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ విజయంపై భారత జట్టు దృష్టి సారించింది.. గత రెండు మ్యాచ్ ల మాదిరి యువ ఆటగాళ్లు సత్తా చాటితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను భారత్ సిద్ధం చేసుకుంటుంది.

ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ను టీమిండియా ఓడిపోయింది. దీంతో యువ ఆటగాళ్ల ఆట తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా యువ ఆటగాళ్లు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా తమ ప్రతిభను చూపించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాలు సాధించింది. రెండవ మ్యాచ్లో 100 పరుగులు, మూడో మ్యాచ్లో 23 పరుగుల తేడాతో గెలుపులను సొంతం చేసుకుంది. ప్రధాన బ్యాటర్లు ఫామ్ లో ఉండడంతో టీమిండియా బ్యాటింగ్ లైన్ అప్ బలంగా కనిపిస్తోంది.. రెండవ టి20 మ్యాచ్లో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడవ టి20 మ్యాచ్లో ఏకంగా హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక రెండవ టి20 మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు.. రుతు రాజ్ గైక్వాడ్ జోరు మీద ఉన్నాడు. యశస్వి టచ్ లోకి వచ్చాడు. ఈ ఆటగాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ మ్యాచ్ లో శివం దూబే, రింకూ సింగ్ కు అవకాశం లభిస్తే ఎలా ఆడతారో చూడాల్సి ఉంది.

భారత బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే మూడవ టి20 మ్యాచ్ లో జింబాబ్వే ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్ లో భారత బౌలింగ్ పూర్తిగా గతి తప్పింది. ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. ఆ స్థాయిలో సత్తా చాటిందంటే దానికి కారణం భారత్ బౌలింగ్ లో పస లేకపోవడమే. ఈ క్రమంలో భారత బౌలర్లు తుది వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ ను పాటించాల్సి ఉంది.

జింబాబ్వే జట్టు తొలి 20 మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి.. భారత జట్టును ఓడించింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీం ఇండియా ఉత్సాహాన్ని నీరుగార్చింది. అయితే అదే జోరును ఆ జట్టు కొనసాగించలేకపోతోంది. బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడంతో ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. బౌలింగ్ కూడా ఆశించినంత స్థాయిలో లేదు. ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక ఫీల్డింగ్ లోనూ ఆ జట్టు నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. కెప్టెన్ సికిందర్ రజా, బెనెట్, ముజరబాని, మైయర్స్ మీదే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. సిరీస్ లో నిలవాలంటే జింబాబ్వే జట్టు నాలుగో టి20 మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. మరి వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన నేపథ్యంలో.. నాలుగవ టి20లో జింబాబ్వే ఏ మేరకు సత్తా చూపిస్తుందో చూడాల్సి ఉంది.

తుది జట్ల అంచనా ఇలా

భారత్

గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్ , అభిషేక్ శర్మ, రుతు రాజ్ గైక్వాడ్, శివం దూబే, సంజు సాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్/ ఖలీల్.

జింబాబ్వే

సికిందర్ రజా(కెప్టెన్), చటార, ఎంగరవ, ముజరబాని, మసకద్జ, మడాండే, క్యాంప్ బెల్, బెనెట్, మైయర్స్, మరుమాని.